గజం భూమి 2.7 ల‌క్ష‌లు… మ‌ధ్య‌త‌ర‌గ‌తికి `హైద‌రాబాద్` దూరం!

గజం భూమి వేల‌ల్లో ఉంటేనే సాధార‌ణ మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు లబోదిబోమనే ప‌రిస్థితి నెల‌కొంటుంది. అలాంటిది.. ల‌క్ష‌లు ప‌లికితే .. ఇంకేం చెప్పాలి. అది కూడా నివాస‌యోగ్య‌మైన స్థ‌లాలు.. జ‌న‌సమ్మ‌ర్థ ప్రాంతాల్లో గ‌జం భూమి(ఓపెన్ ఫ్లాట్ 2.7 ల‌క్ష‌ల రూపాయలు) ధ‌ర‌లు అమాంతం ఆకాశాన్నంటితే.. సాధార‌ణ‌, దిగువ‌, ఎగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లకు గూడు బ‌రువేన‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఇది ఆర్థిక అనిశ్చితికి కూడా దారి తీసే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

ఎక్క‌డ ఎందుకు?

హైద‌రాబాద్‌లోని ప‌లు కీల‌క ప్రాంతాల్లో భూముల ధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్నాయి. పోనీ.. ఇవేవీ పారిశ్రామిక ప్రాంతాలు కావు. అవ‌న్నీ.. జ‌న‌స‌మ్మ‌ర్థ ప్రాంతాలు.. ప్ర‌జ‌లు ఉండాల‌ని.. ఇల్లు క‌ట్టుకోవాల‌ని ఆశ‌లు పెట్టుకునే రాయ‌దుర్గం, కూక‌ట్ ప‌ల్లి.. వంటి జ‌నారణ్యాలు. ప్ర‌స్తుతం ఆయా ప్రాంతాల్లో ఉన్న జ‌నాభాలో 85 శాతం మంది అద్దెకు ఉంటున్న విష‌యం చాలా మందికి తెలియ‌దు. అంతేకాదు.. ఈ అద్దెలు కూడా నింగికెగ‌సి.. జేబులు గుల్ల చేస్తున్నాయి. తాజాగా కూక‌ట్‌ప‌ల్లి హౌసింగ్ బోర్డు కాల‌నీలో ప్ర‌భుత్వ భూమిని విక్ర‌యానికి పెట్టారు.

ఇక్క‌డి భూమి గ‌జానికి 2.7 ల‌క్ష‌ల‌కు ప‌లికింది. దీనిని కొన్ని ప్ర‌ముఖ రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి. చిత్రం ఏంటంటే.. ఆయా భూముల‌ను మిడిల్ ఇన్‌క‌మ్ గ్రూప్‌(మ‌ధ్య‌స్థ ఆదాయవ‌ర్గాలు)కు కేటాయించారు. కానీ, గ‌జం 2.7 ల‌క్ష‌ల రూపాయ‌లు ప‌లికితే.. ఆ మేర‌కు రియ‌ల్ వ్యాపారులు లాభాలు వేసుకుని.. త‌ర్వాత ఎంత‌కు అమ్ముతారు? నిజంగానే మ‌ధ్య‌స్థ ఆదాయ వ‌ర్గాల‌కు ఈ భూములు చేరువ అవుతాయా? అనేది కీల‌క ప్ర‌శ్న‌. మొత్తంగా.. ఈ వ్యాపారంలో స‌ర్కారుకు కోట్ల వ‌ర్షం కుర‌వొచ్చు.. కానీ, సొంత గూడు ఏర్పాటు చేసుకోవాల‌ని క‌ల‌లు గ‌నే మ‌ధ్య ఆదాయ‌వ‌ర్గాల‌కు మాత్రం క‌న్నీరే మిగ‌ల‌నుంది.

ఇక‌, హైద‌రాబాద్‌కు దూర‌మే!

ప్ర‌స్తుతం విక్ర‌యిస్తున్న భూములు, వాటికి ప‌లుకుతున్న కోట్ల రూపాయ‌ల ధ‌ర‌ల‌ను గ‌మ‌నిస్తే.. ఇవి సామాన్యుల‌కు ఎక్క‌డా అందుబాటులో ఉండ‌వ‌న్న‌ది స్ప‌ష్ట‌మ‌వుతోంది. అయితే.. ఇక్క‌డ సందేహం రావొచ్చు.. అలాకొనేవారు రియ‌ల్ ఎస్టేట్ వారే క‌దా.. అని!. కానీ, ఆ త‌ర్వాత వారు క‌ట్టించే అపార్ట్ మెంట్ల‌ను..  భారీ లాభాలు వేసుకుని.. ఎవరికి విక్ర‌యిస్తారు? అనేది చూస్తే.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారే!. సో.. ఈ ప్ర‌కారం చూసిన‌ప్పుడు.. హైద‌రాబాద్‌లో డ‌బుల్ బెడ్ రూం ఫ్లాట్ కొనాలంటే.. వ‌చ్చే రెండేళ్ల‌లో కోటి రూపాయ‌లు ముడుపు క‌ట్టాల్సిందే!. ఇది సాధ్య‌మేనా? లేక‌పోతే.. హైద‌రాబాద్‌కు దూర‌మేనా? అనేది ప్ర‌భుత్వం కూడా ఆలోచ‌న చేయాల్సిన అవ‌స‌రం ఉంది.

ఇది అంతిమంగా స‌ర్కారుపైనే భారం మోపుతుంది. గూడులేని వారంద‌రికీ ప్ర‌భుత్వాలు ఎలానూ గూడు క‌ట్టించే ప‌రిస్థితి ఎలానూ లేదు. క‌నీసం.. సొంత‌గా కొనుగోలు చేయాల‌న్నా.. అంద‌ని ప‌రిస్థితులు క‌ల్పిస్తే.. ఇక ప్ర‌యోజ‌నం ఏంటి? మ‌ధ్య‌త‌ర‌గ‌తి సొంతింటి మంద‌హాసం.. ఎప్పుడు? అనేది ఆలోచింప చేస్తున్న ప్ర‌శ్న‌.