నేపాల్ విషాదం… కన్నీరు పెట్టుకున్న సద్గురు

నేపాల్‌–టిబెట్‌ సరిహద్దుల్లో సంభవించిన ఆకస్మిక జలప్రళయంలో కైలాస మానససరోవర యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణమైన ఈశా ఫౌండేషన్‌కు చెందిన సుమారు 80 మంది సభ్యులు గల్లంతైనట్లు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ తెలిపారు. గల్లంతైన వారిలో 34 మంది పురుషులు, 46 మంది మహిళలు ఉన్నారని, 22 మంది అమెరికన్లు, 12 మంది కెనడియన్లు, 11 మంది ఆస్ట్రేలియన్లు, 9 మంది బ్రిటన్‌ పౌరులు ఉన్నారని వెల్లడించారు. అయితే వారి పరిస్థితిపై అధికారిక నిర్ధారణ ఇంకా రాలేదని స్పష్టం చేశారు.

సుమారు వారం క్రితం ఇమిగ్రేషన్‌ ప్రక్రియ కోసం బృందం ఓ భవనానికి వెళ్లిందని సద్గురు తెలిపారు. ఉదయం 9.05 గంటలకు ఇమిగ్రేషన్‌ కేంద్రానికి చేరుకున్నట్లు ఈశాంగ ప్రవీణ్‌ నుంచి సందేశం వచ్చిందని, 9.14 గంటలకు అకస్మాత్తుగా వరద సంభవించిందని చెప్పారు. ఆ తర్వాత ప్రవీణ్‌ నేపాల్‌ ఫోన్‌ అందుబాటులో లేకుండా పోయిందని తెలిపారు. ఇమిగ్రేషన్‌ భవనం వరదల్లో కొట్టుకుపోయినట్లు పేర్కొంటూ, ఈ విపత్తులో ప్రభావితులు, గల్లంతైన వారి సంఖ్య 1,500 దాటే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే ఇది అధికారిక సంఖ్య కాదన్నారు.

ఘటన జరిగిన గంటలోపే భారత్‌, నేపాల్‌తో పాటు సంబంధిత దేశాల రాయబార కార్యాలయాలకు సమాచారం అందించినట్లు సద్గురు తెలిపారు. భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, చైనా రాయబార కార్యాలయం నుంచి ప్రభావిత ప్రాంతానికి వెళ్లేందుకు అనుమతి కోరుతున్నామని చెప్పారు.

అమెరికా రాయబార కార్యాలయం కూడా స్పందించి చర్యలు చేపడుతోందన్నారు. గల్లంతైన తమ వారి ఆచూకీ తెలుసుకోవడంతో పాటు పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రభావిత ప్రాంతానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని భారత్‌, చైనా, అమెరికా రాయబార కార్యాలయాలను కోరినట్లు తెలిపారు.