ఆ భవనాలు కూల్చేస్తామంటోన్న హైడ్రా రంగనాథ్

హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు కబ్జా చేసిన కట్టిన కట్టడాల కూల్చివేతలు కరెక్టేనని సమర్థిస్తున్నారు. ఇక, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు కోర్టు కూడా పలుమార్లు చివాట్లు పెట్టింది. అయినా సరే, తగ్గేదేలే అని ఆయన ముందుకు పోతున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు గచ్చిబౌలిలో ఏడంతుస్తుల భవనం కూలిన ఘటనా స్థలాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు రంగనాథ్.

50 గజాల స్థలంలో బిల్డర్ సాజిద్ ఏడంస్తుల భవనం కట్టారని, దీనికి సెట్ బ్యాక్ లేదని ఆయన మండిపడ్డారు. అంతేకాదు, ఈ ప్రాంతంలో ఆయన కట్టిన ఈ తరహా బిల్డింగులు అనేకం ఉన్నాయని, వాటన్నింటినీ పరిశీలించి త్వరలోనే కూల్చివేస్తామని సంచలన ప్రకటన చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కట్టిన భవనాలన్నింటినీ కూల్చివేయక తప్పదని స్పష్టం చేశారు.

ఇక, ఈ ప్రాంతంలో చాల నివాస భవనాలను హాస్టల్స్ కు ఉపయోగిస్తున్నారని, వాటిని ఖాళీ చేయాలని యజమానులకు చెబుతామని అన్నారు. ఆ బిల్డింగ్ కుప్పకూలని అంజయ్య నగర్ లో నాలాను ఆక్రమించి ఇష్టారీతిన బిల్డింగులు కట్టారని, ఇక్కడ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కూల్చివేయాల్సిన భవనాలను గుర్తిస్తామని తెలిపారు.