చివరికి స్మశానాలను కూడా వదలలేదు

అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే ఇందుకు నిదర్శనంగా చెప్పాలి. తెలంగాణ రూపురేఖలను మార్చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర నుంచి చివరికి స్మశాన వాటికల అభివృద్దిలోనూ అవినీతి చోటుచేసుకుంటున్న తీరు నిజంగానే కంపరం పుట్టిస్తోందని చెప్పక తప్పదు. ఓ స్మశాన వాటిక అబివృద్ధి పనుల్లోనూ లంచం ఇస్తే తప్పించి బిల్లులు మంజూరు చేయలేనని చెప్పిన ఓ అధికారి తాజాగా పట్టుబడ్డాడు. 

పెద్పల్లి జిల్లాలో మునిసిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ గా పనిచేస్తున్న కల్లేపల్లి సతీశ్ కుమార్ మంగళవారం అవినీతి నిరోధక శాఖకు అడ్డంగా దొరికిపోయాడు. ఈయన గారు చేసిన ఘనకార్యం ఏమిటన్న విషయానికి వస్తే..మునిసిపాలిటీ పరిధిలో ఓ స్మశాన వాటికను రూ.12.28 లక్షల విలువైన పనులు జరగగా… ఆ బిల్లులు మంజూరు చేయాలంటే తనకు రూ.2 లక్షలు లంచం ఇవ్వాల్సిందేనని భీష్మించారట. ఇతర ప్రాజెక్టులు అయితే ఏమోలే అనుకోవచ్చు…చివరాఖరుకు స్మశానాలను కూడా వదలరా? అన్న భావనతో పనులు చేసిన కాంట్రాక్టరు ఆయన తీరుపై నేరుగా ఏసీబీకి ఫిర్యాదు చేశారు.

కాంట్రాక్టరు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు… బాధితుడి నుంచి రూ.2 లక్షల లంచం తీసుకుంటున్న మునిసిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ దాడి అనంతరం ఏసీబీ అధికారులు నేరుగా ఏఈ గారి ఇంటిలో సోదాలు చేయగా… జమా లెక్కలు లేని రూ.32.31 లక్షల నగదు కూడా పట్టుబడిందట. వెరసి ఈ ఏఈ గారు పని ఏమిటన్న విషయాన్ని ఎంతమాత్రం పట్టించుకోకుండా… తాను అనుకుంటున్నట్లుగా రెండు చేతులా సంపాదించుకుంటూ సాగుతూ… స్మశానం లంచంతోనే పట్టుబడిపోయిన వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది.