వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి చెందగా వీరిలో ఏపీకి చెందిన ముగ్గురు, తెలంగాణకు చెందిన మరికొందరు తెలుగువారు ఉన్నట్టు అధికారులు తెలిపారు. అయితే.. ఈ ప్రమాదంలో మరింత మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని అధికారులు తెలిపారు. కాగా, ఏపీ మంత్రి నారా లోకేష్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారు. భారత దౌత్య కార్యాలయ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదించేందుకు అధికారులను నియమించారు.
ఏం జరిగింది?
ఓ ప్రముఖ మొబైల్ కంపెనీ దేశవ్యాప్తంగా ఉన్న తన సెల్ఫోన్ల డిస్ట్రిబ్యూటర్లను, వారి కుటుంబాలను వార్షిక విహార యాత్రలో భాగంగా వియత్నాంకు తీసుకువెళ్లింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 250 మంది ఈ యాత్రకు వెళ్లారు. మరో రెండు రోజుల్లో యాత్ర ముగియనుందనగా భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం భోజనాల అనంతరం.. విహార యాత్రకు వచ్చిన వారిని వియత్నాంలోని ప్రముఖ పూ క్వాక్ ద్వీపంలో పర్యటనకు తీసుకువెళ్లారు. ఇక్కడి సముద్రంలో స్పీడ్ బోట్ రైడింగ్కు వెళ్లారు. అయితే.. అంతా బాగానే జరుగుతోందని భావించిన సమయంలో అలల ధాటికి స్పీడ్ బోట్ బోల్తా పడింది.
బోల్తా పడిన బోటులో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 15 మంది అక్కడికక్కడే నీటిలో చిక్కుకుని మృతి చెందారు. మృతుల్లో ఏపీలోని కడప జిల్లాకు చెందిన డిస్ట్రిబ్యూటర్ శ్రీధర్, మచిలీపట్నానికి చెందిన జయశ్రీ సహా సత్యసాయి జిల్లాకు చెందిన నల్లపేట ఆదిశేషయ్య నీట మునిగి తుదిశ్వాస విడిచారు. తమిళనాడుకు చెందిన వారే ఎక్కువ మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. ఇక, మృతుల్లో తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నట్టు సమాచారం. కాగా.. వియత్నాంకు వెళ్లిన వారిలో ఏపీ నుంచి 35 మంది ఉండగా, తెలంగాణ నుంచి 40 మంది ఉన్నారని అధికారులు తెలిపారు.
ప్రధాని దిగ్భ్రాంతి..
వియత్నాం పడవ ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకునేందుకు విదేశాంగ అధికారులు చర్యలు చేపట్టారని తెలిపారు. ప్యానిక్ వార్తలను నమ్మరాదని ఆయన సూచించారు. ఇదిలావుంటే.. ప్రమాద ఘటనపై వియత్నాం తక్షణమే స్పందించింది. జాతీయ విపత్తు సంస్థకు చెందిన సిబ్బందితోపాటు గజ ఈతగాళ్లను కూడా రంగంలోకి దింపి.. బాధితులను రక్షించే ప్రయత్నంచేశారు. సమీపంలోని మత్స్యకారులు వెనువెంటనే స్పందించారు. అయితే.. అలల ధాటికి బోటు పూర్తిగా తిరగబడడంతో ఎక్కువ మంది మృతి చెందారని అధికారులు తెలిపారు.
చంద్రబాబు తీవ్ర విచారం
వియత్నాంలో జరిగిన పర్యాటక బోటు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు పర్యాటకులు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి మొత్తం 33 మంది వియత్నాం పర్యటనకు వెళ్లగా, వారిలో కొంతమంది ప్రమాదానికి గురైన బోటులో ఉన్నారు. ఈ ప్రమాదంలో కడప జిల్లాకు చెందిన ముడియం శ్రీధర్, కృష్ణా జిల్లాకు చెందిన గెల్లి జయలక్ష్మి, సత్యసాయి జిల్లాకు చెందిన నల్లపేట ఆదిశేషయ్య రవి తేజ మృతి చెందారు. కృష్ణా జిల్లాకు చెందిన గెల్లి కిశోర్ తీవ్ర అస్వస్థతతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారందరూ సురక్షితంగా ఉన్నారు. విహారయాత్రకు వెళ్లిన రాష్ట్రానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates