నీట్ రీ ఎగ్జామ్… ఆ యాప్ బ్యాన్!

నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో, ఈ ఏడాది మే 3న జరిగిన ఆ పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఆ క్రమంలో కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ నెల 21న నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్‌ను నిర్వహించబోతున్నారు. అయితే, నీట్ రీ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని, ఆ పేపర్ అమ్ముతామని కొన్ని టెలిగ్రామ్ ఛానెళ్లు బంపర్ ఆఫర్లు ఇస్తున్నాయి. ఆ ఛానెళ్లను కేంద్రం బ్లాక్ చేయించింది.

ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ 22 వ తేదీ అర్ధరాత్రి వరకు దేశవ్యాప్తంగా టెలిగ్రామ్ యాప్‌పై ఆంక్షలు విధించింది. పోటీ పరీక్షల సమగ్రతను దెబ్బతీసే అత్యంత ప్రమాదకర సాధనం టెలిగ్రామ్ అని ధర్మేంధ్ర ప్రధాన్ కూడా అభిప్రాయపడ్డారు. అంతేకాదు, మెటా, గూగుల్‌తో కలిసి ఇటువంటి తప్పుడు సమాచారాన్ని అడ్డుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

జూన్ 21వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2:00 నుంచి సాయంత్రం 5:15 వరకు దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన అడ్మిట్ కార్డులు ఇప్పటికే విడుదలయ్యాయి.
పేపర్ లీక్ కాకుండా ఈ సారి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. పేపర్ సెట్టర్లు, మోడరేటర్లను ఎగ్జామ్ అయ్యేవరకు లాక్‌డౌన్‌ లో ఉంచారు. అంతేకాదు, వారి మొబైల్, ఇంటర్నెట్ వాడకాన్ని నియంత్రించారు. ఈ సారి పరీక్ష ప్రశ్నా పత్రాలను సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్ భద్రత నడుమ ఎయిర్ ఫోర్స్ ద్వారా రవాణా చేస్తున్నారు.

నీట్ రీ ఎగ్జామ్ నకు సంబంధించిన అధికారిక సమాచారం కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) వెబ్‌సైట్ ను మాత్రమే సందర్శించాలని అభ్యర్థులకు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. టెలిగ్రామ్, వాట్సాప్‌లో వచ్చే లీక్ క్లెయిమ్స్ నమ్మవద్దని కోరుతున్నారు.

కాగా, వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమాలు కూడా రిలీజైన 24 గంటల్లోపే కొన్ని టెలిగ్రామ్ ఛానెళ్లలో పైరసీ రూపంలో ప్రత్యక్షమవడం సినీ నిర్మాతలను కలవరపెడుతోంది. సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసినా, కఠిన చర్యలు తీసుకుంటున్నా సరే కొందరు టెలిగ్రామ్ ఛానెళ్ల నిర్వాహకులు కొత్త దారులు వెతుక్కొని మరీ పైరసీకి పాల్పడుతున్నారని నిర్మాతలు వాపోతున్నారు. ఈ విషయంపై కూడా కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ చేయాలని వారు కోరుతున్నారు.