సాంకేతికంగా మనిషి ఎన్నో అద్భుతాలను సృష్టించాడు. వాటిని తన జీవన విధానంలో భాగం చేసుకున్నాడు. సుఖమయ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే ఎంతగా సాంకేతికంగా అభివృద్ది చెందినా ప్రకృతి ప్రకోపించిందంటే మాత్రం మనిషి మసి కాక తప్పదు. ఇది అక్షర సత్యం అంటూ ఇప్పటికే ఎన్నో పరిణామాలు తేల్చి చెప్పాయి. తాజాగా అలాంటి మరో ఉదాహరణ కనిపించింది. రాజస్థాన్ లోని బికనీర్ పట్టపగలే చీకటిమయంలోకి కూరుకుపోయింది. దీనికి కారణం అక్కడ నెలకొన్న భారీ ఇసుక తుఫానే.
రాజస్థాన్ అంటేనే ఏడారులు గుర్తుకు వస్తాయి. ఎడారి రాష్ట్రంగా పేరు పడిపోయిన రాజస్థాన్ లో బికనీర్ సహా చాలా పట్టణాలు, నగరాలు ఏడారులకు ఆనుకునే ఉంటాయి. బికనీర్ కూడా ఎడారి ప్రాంతమే. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ఉన్నట్టుండి ఇసుక తుఫాను వచ్చేసింది. నగరాన్ని కమ్మేస్తున్నట్లుగా.. నగరంపై విరుచుకుపడుతున్నట్లుగా వచ్చిన ఆ తుఫానుతో బికనీర్ వణికిపోయిందనే చెప్పాలి. ఇసుక తుఫాను కారణంగా నగరంలో విద్యుత్ సరఫరా నిలిచిపోగా… సూర్యుడు అప్పుడే మాయమయ్యాడా? అన్నట్లుగా నగరం మొత్తం చీకట్లోకి వెళ్లిపోయింది.
ఇసుక తుఫాను వస్తున్న సందర్భంగా ఓ వ్యక్తి దానిని వీడియో తీశాడు. సెల్ ఫోన్ ద్వారానే ఈ వీడియో తీసినట్లుగా కనిపిస్తోంది. నెట్టింట వైరల్ గా మారిపోయిన ఈ వీడియోను చూస్తే ఒళ్లు జలదరించక మానదు. నగరంలోని ఇళ్ల మీదుగా… ఇంకా చెప్పాలంటే యావత్తు నగరం మీదుగా ఇసుక అలా వచ్చి పడుతుంటే…దానిని నిలువరించడం అసలు సాధ్యం అయ్యే పనే కాదని చెప్పాలి. ఈ వీడియో చూసిన వారంతా మన నగరాలు, పట్టణాలు, గ్రామాల మీదకు ఇసుక తుఫాను వస్తే మన కథ అయిపోయినట్టేనన్న వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates