సూర్యుడు తూర్పున ఉదయించును.. అనే మాట తెలిసిందే. అయితే.. తాజాగా అదే సూర్యుడు.. ఏపీలోనితూర్పు గోదావరి జిల్లాను తాజాగా మంటెత్తించాడు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఎండ మంటలు రేపింది. భానుడి భగ భగలతో తూర్పుగోదావరి వాసులు అల్లాడిపోయారు. ఏ మండలంలో చూసినా.. ఉష్ణోగ్రతలు.. 48 డిగ్రీలకు పైమాటే అన్నట్టుగా నమోదయ్యాయి. దీంతో ఆదివారం ఇంటి నుంచి ప్రజలు బయటకు కాలు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు.. రాష్ట్రంలోని మెజారిటీ ప్రాంతాల్లో కూడా.. ఎండ తీవ్రత 47 డిగ్రీలకు పైగానే నమోదైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాటి పరిస్థితిపై అంచనా వేసి.. ప్రజలకు కొన్ని సూచనలు చేసింది.
ఆదివారం పరిస్థితి ఇదీ..
తూర్పు గోదావరి: చిట్యాలలో 48.3, గోపాలపురంలో 48.3, ఉండ్రాజవరంలో 48.1 డిగ్రీలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు ఉడుకెత్తిపోయారు. ఇక, పొరుగున ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా పరిస్థితి ఇలానే సాగింది. ఈ జిల్లాలోని అత్తిలి, ఇరగవరం, తణుకు మండలాల్లో 48.1 డిగ్రీల చొప్పున భానుడు ప్రతాపం చూపించాడు. ఇక, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్లలోనూ 48.1 డిగ్రీలతో ఎండ మండించింది. దీంతో ప్రజలు ఇంటి నుంచి కాలు బయట పెట్టలేక పోయారు.
44-47 మధ్యే..
దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు తక్కువగా ఎక్కడా నమోదు కాకపోవడం గమనార్హం. వాస్తవానికి 40 డిగ్రీలు అంటేనే అదిరిపోతారు. అలాంటి రాష్ట్రం మొత్తంగా 44 డిగ్రీల నుంచి 48 డిగ్రీలకు పైగానే భానుడు విజృంభించడం గమనార్హం. విశాఖ నుంచి విజయవాడ వరకు, కర్నూలు నుంచి గుంటూరు వరకు అన్ని ప్రధాన జాతీయ రహదారులు కూడా నిర్మానుష్యంగా మారిపోయాయి. ఇంత ఎండలో వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని భావించిన డ్రైవర్లు.. రహదారులకు పక్కగా వాహనాలను నిలిపివేశారు. ఇక సాధారణ జనజీవనం కూడా పెద్దగా కనిపించలేదు.
ఎక్కడెక్కడ ఎన్నెన్ని డిగ్రీలు?
- ఏలూరు జిల్లా కుక్కునూరు: 47.3
- కృష్ణా జిల్లా నందివాడ: 47.1
- కోనసీమ వ్యాప్తంగా: 47
- బాపట్ల జిల్లా నిజాంపట్నం: 46.2
- కాకినాడ జిల్లా కాజులూరు: 46.5
- ఎన్టీఆర్ జిల్లా మైలవరం: 45.7
Gulte Telugu Telugu Political and Movie News Updates