ఎట్ట‌కేల‌కు లొంగిపోయిన భ‌గీర‌థ్

బాలిక‌పై లైంగిక వేధింపుల కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బండి భ‌గీర‌థ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సైబ‌రాబాద్ సీపీ ర‌మేష్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఆయ‌న‌ను పేట్ బ‌షీరాబాద్ పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించి విచారిస్తామ‌ని చెప్పారు.

కాగా.. గ‌త వారం కింద‌టే భ‌గీర‌థ్‌పై పోక్సో కేసు న‌మోదైంది. అయితే.. ఆయ‌న త‌ప్పించుకు తిరుగుతున్నాడ‌ని పోలీసులు తెలిపారు. వెతికేందుకు ఐదు ప్ర‌త్యేక బృందాల‌ను కూడా ఏర్పాటు చేశారు. అయితే.. అనూహ్యంగా శ‌నివారం రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో భ‌గీర‌థ్ నార్సింగ్‌లో ఉన్న‌ట్టు స‌మాచారం అంద‌డంతో అదుపులోకి తీసుకున్నామ‌ని పోలీసులు తెలిపారు.

అన్ని దారులు..

ఈ కేసులో భ‌గీర‌థ్ ర‌క్ష‌ణ పొందేందుకు ఉన్న అన్ని దారులు మూసుకుపోవ‌డంతోనే ఆయ‌న పోలీసుల‌కు లొంగిపోయిన‌ట్టు తెలుస్తోంది. హైకోర్టులో ముంద‌స్తు బెయిల్ ద‌క్క‌లేదు. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లి ఉప‌శ‌మ‌నం పొందాల‌ని ప్ర‌య‌త్నించారు.

కానీ, సెల‌వులు కావ‌డంతో వేకేష‌న్ బెంచ్ అవ‌కాశం ల‌భించ‌లేదు. ఇంకో వైపు రాజ‌కీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. పోలీసులు ముమ్మ‌రంగా గాలిస్తున్నారు. ఈపరిణామాల క్ర‌మంలో దారులు మూసుకుపోవ‌డం.. బాధిత బాలిక కుటుంబం మరోసారి పోలీసులను ఆశ్ర‌యించ‌డంతో భ‌గీర‌థ్ లొంగిపోయార‌ని తెలుస్తోంది.

నేనే అప్ప‌గించా:

కాగా.. త‌న కుమారుడి విష‌యంపై బండి సంజ‌య్ స్పందించారు. త‌న కుమారుడిని తానే పోలీసుల‌కు అప్ప‌గించాన‌ని ఆయ‌న చెప్పారు. న్యాయం, చ‌ట్టం ప‌ట్ల త‌న‌కు సంపూర్ణ విశ్వాసం ఉంద‌న్నారు. ఎప్ప‌టికైనా న్యాయ‌మే గెలుస్తుంద‌న్నారు.

త‌న కుమారుడు ఏ త‌ప్పూ చేయ‌లేద‌ని చెబుతున్న‌ట్టు తెలిపారు. అందుకే త‌మ వ‌ద్ద ఉన్న ఆధారాల‌ను పోలీసుల‌కు కూడా ఇచ్చామ‌ని చెప్పారు. మ‌రోవైపు కోర్టులో ముంద‌స్తు బెయిల్ కోసం కూడా ప్ర‌య‌త్నించామ‌న్నారు. కానీ.. చ‌ట్టం, పోలీసు వ్య‌వ‌స్థ ప‌ట్ల త‌న‌కు న‌మ్మ‌కం ఉన్నందుకే.. త‌న కుమారుడిని స్వయంగా తానే అప్ప‌గిస్తున్న‌ట్టు సంజ‌య్ మీడియాకు వివ‌రించారు.