రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య… పనిమనిషిదే కీలక పాత్ర?

భాగ్య నగరి హైదరాబాద్ లో శుక్రవారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్)లో సుదీర్ఘ కాలం పనిచేసి ఇటీవలే పదవీ విరమణ పొందిన వినయ్ రంజన్ రే సతీమణి తనూజ (55) వారి ఇంటిలోనే దారుణ హత్యకు గురయ్యారు. జూబ్లీహిల్స్ లోని ప్రశాసన్ నగర్ లో ప్రభుత్వం కేటాయించిన ఇంటిలో రే కుటుంబం నివసిస్తుండగా… వారి ఇంటిలో పనిచేస్తున్న పనిమనిషి కల్పన ఈ హత్యలో కీలక భూమిక పోషించినట్లు పోలీసులు అనుమానిస్తన్నారు. నేపాల్ కు చెందిన కల్పన… మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు. శుక్రవారం తెల్లవారుజామున కల్పన తన ఇద్దరు సన్నిహితులతో కలిసి తనూజను హత్య చేసినట్టుగా తెలుస్తోంది. తనూజ నోట్లో గుడ్డలు కుక్కి ఆమెను అత్యంత దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్య అనంతరం కల్పన బృందం రే ఇంటిలోని బంగారు, నగదుతో పరారైనట్లు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

ఘటనా స్థలాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జన్నార్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నేపాల్ కు చెందిన హంతక ముఠా ఈ దారుణానికి తెగబడినట్లుగా గుర్తించామని తెలిపారు. నేపాలీ పనిమనుషులతో కాస్తంత జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.

ప్రముఖుల ఇళ్లల్లో పనిమనుషులుగా కుదురుతున్న నేపాలీ ముఠాలు అవకాశం కోసం వేచి చూస్తారని ఆయన తెలిపారు. అవకాశం రాగానే… ఇంటిలోని ముఖ్యమైన వ్యక్తులను హత్య చేసి డబ్బు, నగలతో ఉడాయించడం ఈ ముఠాలకు వెన్నతో పెట్టిన విద్య అని పేర్కొన్నారు. బెంగళూరు, ముంబై, పుణేలలో ఈ తరహా ఘటనలు చోటుచేసుకున్నాయని ఆయన తెలిపారు.