MI మిస్టరీ స్పిన్నర్.. ‘జై శ్రీరామ్’ వెనుక అసలు కథ

​ఐపీఎల్ అంటేనే కోట్లు కురిపించే లీగ్ అని అందరూ అనుకుంటారు, కానీ దీని వెనుక కొన్ని జీవితకాల పోరాటాలు ఉంటాయి. నిన్న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తరపున అరంగేట్రం చేసిన రఘు శర్మ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా 33 ఏళ్ల వయసులో ఏ క్రికెటర్ అయినా రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తాడు, కానీ జలంధర్‌కు చెందిన ఈ లెగ్ స్పిన్నర్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి తన కలను నిజం చేసుకున్నాడు.

ఒక మధ్యతరగతి కుర్రాడు ఐపీఎల్ స్థాయికి చేరడానికి ఎన్ని కష్టాలు పడతాడో రఘు శర్మ ప్రయాణం చూస్తే అర్ధమవుతుంది. ​ఈ మ్యాచ్‌లో తన మొదటి వికెట్ తీసిన తర్వాత రఘు శర్మ జేబులో నుంచి ఒక చిన్న నోట్ పేపర్ తీసి కెమెరా వైపు, ఆడియెన్స్ వైపు చూపించాడు. ఆ నోట్‌లో రాసిన మాటలు ప్రతి ఒక్కరినీ కదిలించాయి. “రాధే రాధే.. గురువుల దయతో నా 15 ఏళ్ల సుదీర్ఘమైన, బాధాకరమైన నిరీక్షణ ఈరోజుతో ముగిసింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ముంబై ఇండియన్స్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటాను. జై శ్రీరామ్” అని అందులో రాసి ఉంది.

దశాబ్దన్నర కాలం పాటు ఆశ చావకుండా నెట్స్ లో బౌలింగ్ చేస్తూ, అవకాశాల కోసం ఎదురుచూసిన ఒక ఆటగాడి ఆవేదన ఆ చిన్న కాగితంలో కనిపించింది. ​నిజానికి రఘు శర్మ ప్రయాణం అంత సాఫీగా సాగలేదు. 2025లో ముంబై ఇండియన్స్‌కు నెట్ బౌలర్‌గా ఎంపికై, ఆ తర్వాత గాయపడిన ఆటగాడి స్థానంలో జట్టులోకి వచ్చాడు. అతని అంకితభావాన్ని గుర్తించిన ముంబై యాజమాన్యం రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో 2026 సీజన్ కోసం రిటైన్ చేసుకుంది.

పంజాబ్, పుదుచ్చేరి తరపున దేశవాళీ క్రికెట్‌లో ఎంతో అనుభవం ఉన్నా, ఐపీఎల్ అనే మెయిన్ స్టేజ్ ఎక్కడానికి అతనికి ఇన్నేళ్లు పట్టింది. చాలామంది ప్రతిభావంతులు మధ్యలోనే వదిలేసే ఈ పరుగు పందెంలో రఘు శర్మ మాత్రం మొండిగా నిలబడి గెలిచాడు. ​మ్యాచ్ విషయానికి వస్తే, నికోలస్ పూరన్ (63), మిచెల్ మార్ష్ (44), హిమ్మత్ సింగ్ (40*) మెరుపులతో లక్నో 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముంబై బౌలర్లు బుమ్రా, దీపక్ చాహర్ వికెట్లు తీయలేక ఇబ్బంది పడుతున్న సమయంలో, రఘు శర్మ తన లెగ్ బ్రేక్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. అక్షత్ రఘువంశీ వికెట్ తీసి తన మొదటి ఐపీఎల్ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో ముంబై బ్యాటర్లు రోహిత్ శర్మ (84), ర్యాన్ రికెల్టన్ (83) విధ్వంసం సృష్టించి జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు.