ఈశాన్య భారతంలో నిత్యం ఎక్కడో ఒకచోట అల్లర్లు నిత్యకృత్యంగా మారిపోయాయి. రెండేళ్ల క్రితం మణిపూర్ లో రాజుకున్న రెండు తెగల వివాదం యావత్తు భారత దేశాన్ని ఓ కుదుపు కుదిపేసింది. భద్రతా దళాలు రోజుల తరబడి శ్రమించి అక్కడి పరిస్థితులను చల్లార్చాయి. ఈ ఘటనలను మరిచిపోకముందే మరోమారు మణిపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతి భద్రతల పరిరక్షణ కోసం శ్రమిస్తున్న భద్రతా దళాలపై అక్కడి నిరసనకారులు ఎదురు దాడులకు తెగబడుతున్నారు. వెరసి 2023 నాటి పరిస్థితులు మరోమారు దాపురిస్తాయా? అన్న దిశగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
2023లో రెండు తెగల మధ్య రాజుకున్న వివాదం చిలికిచిలికి గాలివానలా మారింది. ఈ ఘర్షణల్లో ఏకంగా 260 మంది చనిపోగా… 60 వేల మందిదాకా నిరాశ్రయులుగా మిగిలిపోయారు. కేంద్ర ప్రభుత్వం ఈ పరిస్థితులను చల్లబరిచే దిశగా పకడ్బందీ చర్యలు చేపట్టలేదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘర్షణలు దాదాపుగా రెండేళ్ల పాటు కొనసాగిన వైనం కూడా యావత్తు దేశ ప్రజలను దిగ్భాంతికి గురి చేశాయి.
తాజాగా మణిపూర్ లో మరోమారు అల్లర్లు చెలరేగాయి. శుక్రవారం మణిపూర్ కు చెందిన ట్రోంగ్లావోబీ ప్రాంతంలో ఇద్దరు పిల్లల హత్యలు ఉన్నట్టుండి పెద్ద ఘర్షణలకు తెర తీశాయి. బాధితుల తరఫున పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.
ఈ నిరసనలు రాజధాని ఇంపాల్ లోని తూర్పు ప్రాంతానికి కూడా విస్తరించాయి. అల్లర్లను అదుపు చేసేందుకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. చాలా ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి చల్లారినట్టు కనిపించినా.. ఇంకా చాలా ప్రాంతాల్లో పరిస్థితి ఉధ్రిక్తంగానే ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates