హిందూ ముస్లిం భాయ్ భాయ్.. ఇది కదా ఇండియా అంటే

రంజాన్ సందర్భంగా జైపూర్‌లో మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే అరుదైన దృశ్యం కనువిందు చేసింది. హిందూ–ముస్లిం ఏకతా సమితి ఆధ్వర్యంలో, ఈద్‌గాహ్‌లో నమాజ్ నిర్వహిస్తున్న ముస్లిం సోదరులపై హిందూ సమాజానికి చెందిన సభ్యులు పూలు చల్లి శుభాకాంక్షలు తెలిపారు. ఈ చర్య దేశవ్యాప్తంగా సోదరభావం, సామాజిక ఐక్యతకు బలమైన సందేశాన్ని అందించింది.

ఈద్ ఉదయం పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు సంప్రదాయ దుస్తుల్లో ఈద్‌గాహ్‌కు చేరుకుని ప్రశాంత వాతావరణంలో నమాజ్ నిర్వహించారు. నమాజ్ పూర్తైన వెంటనే అక్కడ ఉన్న హిందూ సమాజ సభ్యులు నమాజ్ చేస్తున్న వారిపై పూల వర్షం కురిపించడం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. పరస్పర ప్రేమ, గౌరవానికి ఇది నిదర్శనంగా నిలిచింది.

ఈ సందర్భంగా హిందూ–ముస్లిం ఏకతా సమితికి చెందిన రాజేష్ కుమార్ శర్మ మాట్లాడుతూ, “అందరికీ ఈద్ శుభాకాంక్షలు. మతాల మధ్య ఐక్యత ఎప్పటికీ కొనసాగాలి. కొందరు విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేయడం తప్పు.

రాముడు లేకుండా రమజాన్ లేదు, ఈద్ లేకుండా దీపావళి లేదు. మనమంతా ఒక్కటే అన్న సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాం” అని పేర్కొన్నారు. పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా ఈద్‌గాహ్‌కు చేరుకుని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతి, సౌహార్దం, సోదరభావాన్ని కాపాడాలని అందరూ పిలుపునిచ్చారు.