ఆదర్శ కుటుంబంలో మరో అందం

విక్టరీ వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటిసారి కలయికల్లో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబంలో మెయిన్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే కీలక భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ఫ్యామిలీ కం యాక్షన్ ఎంటర్ టైనర్ ని వేసవి అయిపోయే లోగా గుమ్మడికాయ కొట్టాలనే సంకల్పంతో పరుగులు పెట్టిస్తున్నారు. అక్టోబర్ విడుదలని టార్గెట్ చేసుకున్నారు కానీ ఇప్పుడప్పుడే అనౌన్స్ చేసే ఉద్దేశంలో లేరు. కొద్దిగా టైం పడుతుంది.

ఇదిలా ఉండగా ఆదర్శ కుటుంబంలో మరో అందం వచ్చి చేరింది. నివేత పేతురాజ్ కు ఒక ప్రాధాన్యం ఉన్న పాత్ర ఇచ్చినట్టు తెలిసింది. ఇంతకు ముందు అల వైకుంఠపురములో కూడా నివేత నటించింది. బన్నీ మరదలిగా వేసింది చిన్న వేషమే అయినా కొంచెం స్పేస్ దొరికింది. ఈ మధ్య స్క్రీన్ మీద ఎక్కువ కనిపించని నివేతకు ఇది మంచి బ్రేక్ అవుతుందని చెప్పొచ్చు. క్యారెక్టర్ వివరాలు పూర్తిగా తెలియదు కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసరని టాక్.

ఇదిలా ఉండగా దర్శకుడిగా కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ కేవలం సింగల్ హీరోయిన్ కి పరిమితమయ్యేవారు. నువ్వే నువ్వే, అతడు, ఖలేజా మొదలైన వాటిలో రెండో కథానాయిక ఉండదు. కానీ తర్వాత స్టయిల్ మార్చారు. అఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత వీర రాఘవ, గుంటూరు కారం ఇలా దేన్ని తీసుకున్నా సెకండ్ ఆప్షన్ ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఆఆలో అనుపమ పరమేశ్వరన్ కు దక్కినంత స్కోప్ మిగిలినవాళ్లకు అంతగా కుదరలేదు.

వెంకీకి రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్ నువ్వు నాకు నచ్చావ్, మల్లేశ్వరి లాంటి బ్లాక్ బస్టర్స్ తో పాటు వాసు లాంటి మ్యూజికల్ మూవీకి మంచి మాటలు రాశారు. అప్పటి నుంచే మాటల మాంత్రికుడి డైరెక్షన్లో వెంకటేష్ నటించాలని ఫ్యాన్స్ కోరుతూ వచ్చారు. దశాబ్దాల తర్వాత వాళ్ళ కోరిక నెరవేరుతోంది. సంగీత దర్శకుడిగా మొదట తీసుకున్న హర్షవర్ధన్ రామేశ్వర్ స్థానంలో తమన్ వచ్చిన సంగతి తెలిసిందే. మ్యూజిక్ సిట్టింగ్స్ ఆల్రెడీ మంచి ఊపుమీదున్నాయి.