సూర్య ఇంతకన్నా కోరుకునేది ఏముంది

నిన్నటితో కరుప్పు అలియాస్ వీరభద్రుడు 200 కోట్ల గ్రాస్ దాటినట్టు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. గ్రౌండ్ రియాలిటీలో ఈ నెంబర్లు కొంచెం అటుఇటు ఉండొచ్చు కానీ తమిళనాడులో బ్లాక్ బస్టర్ కలెక్షన్లతో కరుప్పు దూసుకుపోవడం వాస్తవం. పోటీ లేని కారణంగా తెలుగులో మొదటి వీకెండ్ మంచి కలెక్షన్లు రాబట్టిన వీరభద్రుడు ఇప్పుడు కూడా స్టడీగానే ఉంది. కొత్త రిలీజుల్లో ఆసక్తి కలిగించేవి లేకపోవడం ఇంకో వారాంతం కలిసి వచ్చేలా చేస్తోంది.

పదమూడేళ్ళగా బ్లాక్ బస్టర్ కోసం మొహం వాచిపోయిన సూర్యకి ఇది చాలా పెద్ద రిలీఫ్. అసలే కోలీవుడ్ బాక్సాఫీస్ సరైన కంటెంట్ లేక బోరుమంటోంది. మధ్యలో కొన్ని చిన్న సినిమాలు సక్సెస్ అయ్యాయి కానీ అవేవి వందల కోట్లు తెచ్చినవి కాదు. సంక్రాంతికి వచ్చిన పరాశక్తి డిజాస్టర్ కావడం, జన నాయకుడు ఇప్పటికీ మోక్షం దక్కించుకోకపోవడం లాంటి కారణాలు పరిస్థితిని దిగజార్చాయి. ఇలాంటి టైంలో కరుప్పు వాళ్ళ పాలిట కామధేనువు అయ్యింది.

వాయిదాలు, ఆర్థిక సమస్యలు ఎన్ని చుట్టుముట్టినా వీరభద్రుడుకి టైం భలే కలిసి వచ్చింది. అపోజిషన్ లో ఇంకో పెద్ద మూవీ ఏదైనా ఉంటే ఈ స్థాయి రెస్పాన్స్ వచ్చేదా అంటే అనుమానమే అంటున్నాయి బయ్యర్ వర్గాలు. నేటివిటీ వల్ల తమిళ జనాలు విపరీతంగా చూస్తున్నారు. ఏపీ తెలంగాణలో సూర్య ఇమేజ్ తో పాటు టైటిల్, కంటెంట్ ఉన్న మాస్ అప్పీల్ పబ్లిక్ ని టికెట్లు కొనేలా చేసింది. ఇదంతా సూర్యకు సంతోషం కలిగించేదే.

ఇక నెక్స్ట్ సూర్య నుంచి వస్తున్న సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్. సితార సంస్థలో వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ రామ్ కామ్ డ్రామాలో మమిత బైజు హీరోయిన్ గా నటించింది. వీరభద్రుడు ఫలితం పుణ్యమాని దీనికి డిమాండ్ పెరుగుతోందట. అయితే మాస్ ఎలిమెంట్స్ ఉన్నది కాకపోవడంతో వసూళ్ల పరంగా అదే స్థాయి స్పందన వస్తుందని చెప్పలేం. సూర్యకు కరుప్పుతో సమానంగా విశ్వనాథ్ మీద నమ్మకం ఉందట. అదే జరిగితే ఫ్యాన్స్ కి డబుల్ బొనాంజానే.