కాక్రోచ్ జనతా పార్టీ.. సరదా ట్రెండా? లేక..?

దేశంలో ఇప్పుడు “కాక్రోచ్ జనతా పార్టీ” పేరే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పేరు వింతగా ఉన్నా.. దీని వెనుక యువతలో పెరుగుతున్న నిరుద్యోగం, అసంతృప్తి, వ్యవస్థపై కోపం కనిపిస్తోందని చాలామంది చెబుతున్నారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిరుద్యోగ యువతను “బొద్దింకల్లా తయారయ్యారు” అని వ్యాఖ్యానించారనే వార్తల తర్వాత.. మహారాష్ట్రకు చెందిన 30 ఏళ్ల అభిజీత్ దీష్కే అనే యువకుడు “కాక్రోచ్ జనతా పార్టీ” పేరుతో కొత్త పార్టీని ప్రకటించాడు. ఈ పార్టీని సరదాగా మొదలుపెట్టినా.. యువత నుంచి భారీ స్పందన వస్తోంది.

“సెక్యులర్.. సోషలిస్ట్.. డెమోక్రటిక్.. లేజీ” అనేది ఈ పార్టీ నినాదం. “ప్రజల డబ్బు ఎక్కడ ఖర్చవుతోంది అని ప్రశ్నించేందుకే పార్టీ పెట్టాం” అని అభిజీత్ చెబుతున్నాడు. ఈ పార్టీలో చేరాలంటే నిరుద్యోగి అయి ఉండాలి.. సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండాలి.. వ్యవస్థపై కోపం ఉండాలి అంటూ సరదాగా అర్హతలు కూడా పెట్టారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే ఈ పార్టీకి లక్షలాది మంది ఫాలోవర్లు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. యువత కూడా దీన్ని బాగా షేర్ చేస్తోంది. చాలా మంది తమ సమస్యలను చెప్పుకునే వేదికగా దీన్ని చూస్తున్నారు. టీఎంసీ ఎంపీ మహువ మొయింట్రా సహా కొంతమంది ప్రముఖులు కూడా ఈ పార్టీకి మద్దతుగా పోస్టులు పెట్టడం మరింత చర్చకు దారి తీసింది.

అయితే.. ఇది నిజంగా రాజకీయ పార్టీగా మారుతుందా? లేక సోషల్ మీడియా ట్రెండ్‌గానే మిగిలిపోతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో పోటీ చేయాలంటే పార్టీకి స్పష్టమైన ప్రణాళిక, నాయకత్వం, కేడర్ అవసరం.

అవి లేకపోతే ఈ హడావుడి కొద్ది రోజుల్లో తగ్గిపోవచ్చని రాజకీయ నిపుణులు అంటున్నారు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. దేశంలో యువతలో నిరుద్యోగంపై అసంతృప్తి పెరుగుతోంది. సోషల్ మీడియా ద్వారా తమ కోపాన్ని, బాధను బయటపెడుతున్నారు. “కాక్రోచ్ జనతా పార్టీ” ఆ భావాలకు ఇప్పుడు ఒక గుర్తుగా మారింది.