కమిన్స్ రేంజ్ లో సైలెంట్ చేస్తాడట

టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ పోరు మొదలవ్వక ముందే మాటల యుద్ధం మొదలైంది. ముంబై వేదికగా జరగనున్న భారత్ vs ఇంగ్లాండ్ మ్యాచ్ గురించి ఇంగ్లీష్ ఆల్ రౌండర్ సామ్ కరన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాంఖడే స్టేడియంలోని హోరును ఆపి, అక్కడి ప్రేక్షకులను మౌనంగా ఉండేలా చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ గ్రౌండ్‌లో నిశ్శబ్దం నెలకొంటే, తాము మ్యాచ్ గెలుస్తున్నామని అర్థమని ఆయన చెప్పుకొచ్చారు.

కరన్ మాటలు వింటుంటే 2023లో పాట్ కమిన్స్ చేసిన హెచ్చరికలు గుర్తుకు వస్తున్నాయి. అహ్మదాబాద్ ఫైనల్లో భారతీయులను సైలెంట్ చేస్తానని కమిన్స్ అన్నట్లుగానే చేసి చూపించాడు. అభిమానులకు ఇప్పటికి అదొక మాయని గాయం. ఇప్పుడు కరన్ కూడా అదే తరహాలో మైండ్ గేమ్స్ ఆడుతున్నారు.

ముంబై ఫ్యాన్స్ ఇచ్చే మద్దతును ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఐపీఎల్ అనుభవం తమకు ఇక్కడ బాగా పనికొస్తుందని పేర్కొన్నారు. ఒత్తిడిని అధిగమించి స్టేడియాన్ని నిశ్శబ్దంగా మార్చడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లో ఈ రెండు జట్లు తలపడటం ఇది మూడోసారి. గతంలో ఒకసారి ఇంగ్లాండ్, మరోసారి భారత్ గెలిచి సమంగా ఉన్నాయి. అయితే ఈసారి గెలుపు కోసం ఎంతటి కష్టానికైనా సిద్ధమని సామ్ కరన్ చెబుతున్నారు. తనకు ఆట పర్ఫెక్ట్‌గా ఉండటం కంటే, ఏ రకంగానైనా ఫైనల్ చేరడం మాత్రమే ముఖ్యమని వ్యాఖ్యానించారు. గత కొన్ని వారాలుగా పడుతున్న శ్రమకు ఈ విజయం దక్కాలని ఆశిస్తున్నారు.

వాంఖడే స్టేడియం పరిమాణంలో చిన్నదైనా, అక్కడ ఫ్యాన్స్ చేసే సౌండ్ గట్టిగా ఉంటుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టుకు ఈ మద్దతు పెద్ద బలంగా మారనుంది. హోమ్ గ్రౌండ్‌లో ఆడుతుండటం వల్ల మన ప్లేయర్లకు అదనపు అడ్వాంటేజ్ ఉంటుంది. సంజూ శాంసన్ లాంటి ఆటగాళ్లు ఫామ్‌లో ఉండటం భారత్‌కు పెద్ద ప్లస్ పాయింట్. ఇంగ్లాండ్ ప్లేయర్లు కేవలం మాటలకే పరిమితం అవుతారా లేక మైదానంలో కూడా సత్తా చాటుతారా అనేది చూడాలి.