త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల ప్రజల మనసు చూరగొనేలా నిర్ణయాలు తీసుకుంటోంది. సోమవారం.. పశ్చిమ బెంగాల్ ప్రజలను ఉద్దేశించి.. 5 పేజీల సుదీర్ఘ లేఖ రాసిన ప్రధాన మంత్రి.. బెంగాల్ ప్రజల సమస్యలను ప్రస్తావించడంతోపాటు.. తాను అండగా ఉంటానని.. ప్రజలు తమకు పట్టం కట్టాలని అభ్యర్థించారు. వచ్చే ఎన్నికల్లో బంగారు బెంగాల్ ను సాకారం చేసుకుందామని పిలుపునిచ్చారు.
ఇక, మంగళవారం.. జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కేరళకు సంబంధించి సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సెంటిమెంటు సమస్యను పరిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ రాష్ట్ర పేరును `కేరళం`గా మారుస్తూ.. కేరళ అసెంబ్లీ చేసిన తీర్మానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఆ రాష్ట్ర పేరు ఇక నుంచి `కేరళం`గా మారనుంది. వాస్తవానికి 2023లోనే(రెండేళ్ల కిందటే) కేరళ అసెంబ్లీ ఈ మేరకు తీర్మానం చేసింది. అయితే.. అప్పట్లో కేంద్రం ఈ ప్రతిపాదనను పక్కన పెట్టింది.
తర్వాత.. మరో రెండు సార్లు సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని కేరళ కేబినెట్ రాష్ట్ర పేరును మారుస్తూ.. అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ.. కేంద్రం పట్టించుకోలేదు. ఇక, ఇటీవల జరిగిన రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో చివరి సారిగా కేరళ రాష్ట్ర పేరును కేరళంగా మార్చాలని కోరుతూ.. నాలుగో సారి తీర్మానం చేసిన అసెంబ్లీ.. కేంద్రానికి పంపించింది. దీనికి కారణాలు కూడా వివరించింది.
1) బ్రిటీష్ వారి కాలంలో కేరళం పేరును తమకు సౌలభ్యంగా ఉండేందుకు గాను కేరళగా మార్చారని పేర్కొంది. 2) కేరళ పూర్వనామం కేరళం అని తెలిపింది. దీనిని కొనసాగించాలని.. కేరళ సంస్కృతి సంప్రదాయాలకు గౌరవం ఇవ్వాలని అభ్యర్థించింది.
ఇక, త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కేంద్రం తాజాగా ఈ పేరు మార్పునకు పచ్చ జెండా ఊపింది. త్వరలోనే పార్లమెంటు సాధారణ మెజారిటీతో దీనిని ఆమోదించి.. రాష్ట్రపతికి పంపనున్నారు. ఆమె ఆమోదం పూర్తయ్యాక.. రాజ్యాంగంలో కేరళ పేరును `కేరళం`గా మార్చనున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates