ఏపీ వద్దంటున్న కంపెనీ లక్ష కోట్లకు ఎదిగింది


ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో ప్రముఖ ఫార్మాసూటికల్ కంపెనీ దివీస్ ల్యాబ్స్ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం జిల్లాలోని కొత్తపాకల గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇక్కడ దివీస్ ఫ్యాక్టరీ నిలిపి వేయాలని, తాము అధికారంలోకి వస్తేఈ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆపిస్తానని గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చాలని స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు.

వామపక్ష నేతలతో కలిసి ఈ ఫ్యాక్టరీ లోనికి దూసుకెళ్లిన స్థానికులు ప్రహరీ గోడను కూలగొట్టడంతో పాటు అక్కడ ఉన్న తాత్కాలిక నిర్మాణాలకు నిప్పుపెట్టే ప్రయత్నం చేశారు. షెడ్లను ధ్వంసం చేశారు. కొందరు పెద్ద పెద్ద రాళ్లు తీసుకుని, ఆ రాళ్లతో కంపెనీ గోడల మీద విసురుతున్న దృశ్యాలను పలు టీవీ ఛానళ్లు ప్రసారం చేశాయి కూడా.

ఐతే ఏపీలో దివీస్‌కు వ్యతిరేకంగా ఇంత ఆందోళన జరుగుతుంటే.. ఆ సంస్థ అరుదైన ఘనత సాధించింది. దేశంలో లక్ష కోట్ల మార్కెట్ విలువ కలిగిన అరుదైన కంపెనీల్లో ఒకటిగా ఘనత సాధించింది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఈ సంస్థ దేశంలో మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా అతి పెద్ద ఫార్మా కంపెనీల్లో రెండో స్థానం సాధించింది.

సన్ ఫార్మా 1 లక్షా 37 వేల కోట్ల విలువతో అగ్ర స్థానంలో ఉండగా.. దివీస్ 1 లక్షా 1674 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. డాక్టర్ రెడ్డీస్ 84 వేల కోట్లతో ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. సిప్లా రూ.63 కోట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. 2003లో ఈ సంస్థ పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. రూ.10 రూపాయల ముఖ విలువతో ఉన్న షేర్‌ను అప్పుడు రూ.130కి విక్రయించింది. ఇప్పుడా షేర్ ధర రూ.3800 దాటిపోవడం విశేషం. ఏడాది వ్యవధిలో షేర్ ధర రెట్టింపైంది. ఈ నేపథ్యంలోనే దివీస్ మార్కెట్ విలువ లక్ష కోట్ల మార్కును దాటేసింది.