సోషల్ మీడియాల్లో రీల్స్ పిచ్చి ముదిరి పాకాన పడుతోంది. ఇప్పటికే రీల్స్ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసభ్య పదాలు.. చర్యలతో రీల్స్ను అనేక మంది ధ్వంసం చేస్తున్నారు. ఒక సదుద్దేశంతో రీల్స్ను తీసుకువచ్చినా.. దీనిలో అసభ్యకర, అభ్యంతరకర కంటెంట్ పెరిగిపోయింది. దీంతో రీల్స్ చూడాలంటేనే భయం వేసే పరిస్థితులు నేడు నెలకొన్నాయి.
ఇక, ఈ రీల్స్ మోజులో పడుతున్న యువతతో పాటు పలువురు మహిళలు కూడా ప్రాణాల మీదకి తెచ్చు కుంటున్నారు. ఇటీవల ఓ యువతి.. చెరువు గట్టుపై నిలబడి వయ్యారంగా రీల్స్ చేస్తుండగా.. ఆ గట్టు అంచు తెగిపోయి.. ఆమె ఒక్క ఉదుటున చెరువలో పడిప్రాణాలు పోగొట్టుకుంది. ఈ ఘటన ఎక్కడో కాదు.. నిజామాబాద్లోనే జరిగింది.
మరో వ్యక్తి.. కరీంనగర్లో.. రైలు పట్టాలపై రైలు వేగాన్ని అనుసరిస్తూ.. పరిగెట్టి రీల్స్ చేయబోగా.. ఆ రైలే అతనిని పట్టాలపైకి లాగేసింది. ఫలితంగా.. కుటుంబంలో గర్భశోకం.
మరిన్ని చిత్రమైన ఘటనలు కూడా ఉన్నాయి. రీల్స్ యావలో పడి.. తనకు అన్నం పెట్టలేదని.. మహారాష్ట్రకు చెందిన ఓ భర్త.. తన భార్యకు విడాకులు ఇచ్చాడు. దీనిని కోర్టు కూడా సమర్థించడం.. గత నెల లోనే సంచలనం రేపింది.
ఇక, పెళ్లిళ్లలోనూ రీల్స్ తాకిడి పెరుగుతోంది. ఇటీవల గుజరాత్లో ఓ వివాహ వేడుకలో పెళ్లి కుమార్తె రీల్స్ చేసింది. ఆమె.. చెంగుచెంగున గెంతుతూ చేసిన ఈ రీల్ చూసి.. మగ పెళ్లివారు పెళ్లి రద్దుచేసుకుని వెళ్లిపోయారు.
తాజాగా.. జరిగిన ఘటనలో సరదా కోసం చిత్రీకరించాలనుకున్న ఓ దృశ్యం చివరకు విషాదాంతమైంది. ఉత్తరప్రదేశ్లోని బాందా జిల్లాకు చెందిన 27 ఏళ్ల మోహిని ఇంట్లో ఉరి వేసుకుంటున్నట్లు నటించే రీల్స్ చేసింది.
కానీ, ప్రమాదవ శాత్తు సదరు తాడు.. గట్టిగా బిగుసుకుంది. దీనిని గమనించకుండా.. ఆమె ఎత్తయిన స్టూల్పై నుంచి కిందికి దూకేసింది. అంతే.. ఇంకేముంది.. క్షణాల్లో ప్రాణాలు హరీ మన్నాయి. సో.. రీల్స్ మంచిదే అయినా.. రియల్ లైఫ్ను మించి మంచివి కాదన్న విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
