హమ్మయ్య… ఎట్టకేలకు దొరికిన పెద్దపులి

తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలోని కూర్మాపురం, కడియంవాసులకు 6 రోజులుగా కంటి మీద కునుకు లేదు. ఆ ప్రాంతంలో తిరుగుతున్న పెద్ద పులి ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో…దాడి చేస్తుందో అని చుట్టుపక్కల గ్రామాల వారు కూడా హడలిపోయారు. ఆ పెద్దపులిని దాని పాదముద్రల ఆధారంగా పట్టుకునేందుకు ఆరు రోజులుగా అటవీ సిబ్బంది నానా తిప్పలు పడ్డారు.

పులి జాడ, పాదముద్రలు కనిపించిన ప్రాంతాలను బట్టి ట్రాప్ లను, నైట్ విజన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే 6 రోజులుగా వారందరినీ ముప్పుతిప్పలు పెట్టిన పెద్దపులి ఎట్టకేలకు చిక్కింది. చివరకు కూర్మాపురంలోని పాడుబడిన ఇంట్లో ఉన్న పులికి మత్తు మందు ఇచ్చి అటవీ శాఖ అధికారులు బంధించారు.

ఆ ఇంట్లో నుంచి పులి గాండ్రింపులు వినిపిస్తున్నాయని అటవీ శాఖ అధికారులకు స్థానికులు సమాచారమిచ్చారు. దీంతో, తుపాకీతో మత్తు ఇంజక్షన్ షూట్ చేసి పులిని పట్టుకోవాలని వారు ప్రయత్నించారు. అయితే, జనం అలజడికి అదిరిబెదిరిన పులి ఆ ఇంట్లో నుంచి సమీపంలోని పొలాల్లోకి పారిపోయింది. అయితే, పులిని వెంటాడిన అటవీ శాఖ సిబ్బంది ఎట్టకేలకు సాయంత్రం కొత్త చెరువు వద్ద మత్తు ఇంజక్షన్ తో షూట్ చేసి పులిని బంధించారు.

అంతకుముందు, తూ.గో జిల్లాలోని రఘునాథపురం, రాజానగరం, జి.యర్రంపాలెంలో 3 ఆవులు, ఒక దూడను చంపింది. అదృష్టవశాత్తూ మనుషులు పులి కంట పడలేదు. అయినా సరే జిల్లా వాసులు భయాందోళనకు గురయ్యారు.

ఈ క్రమంలోనే ఆరు రోజుల పాటు పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు తీవ్రంగా శ్రమించారు. పుణె, ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణుల బృందం పులి జాడ గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు, థర్మల్ డ్రోన్లు, ఆధునిక పరికరాలను ఉపయోగించింది. తమను దాదాపు వారం రోజుల పాటు ముప్పుతిప్పలు పెట్టిన పులి చివరకు చిక్కడంతో తూ.గో జిల్లా వాసులు ఊపిరి పీల్చుకున్నారు.