వారి బాధ వర్ణనాతీతం ‘బంగారం’

​హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇవాళ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక కేజీ వెండి ధర ఏకంగా రూ.13,000 పెరిగి రూ.4,00,000 మార్కును అందుకుంది. అటు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,65,170కి చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,400కి ఎగబాకి ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది. పెరిగితే వేలల్లో పెరుగుతూ, తగ్గితే కేవలం వందల్లోనే తగ్గుతున్న పసిడి తీరు సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది.

​ఈ అసాధారణ ధరల పెరుగుదల మధ్యతరగతి కుటుంబాలకు తీరని వేదనను మిగిల్చింది. ఏడాది క్రితం ధరలు కాస్త ఎక్కువగా ఉన్నప్పుడే, “లక్ష దాటింది కదా.. ఇక ఇంతకంటే ఏం పెరుగుతుందిలే” అని చాలామంది తమ దగ్గరున్న బంగారాన్ని అమ్మేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ధరలు చూస్తుంటే వారు తల పట్టుకుంటున్నారు. ఊహించని విధంగా బంగారం ఇస్తున్న ఈ స్ట్రోక్ భరించడం సామాన్యుడి వల్ల కావడం లేదు.

​ముఖ్యంగా తాకట్టు పెట్టిన నగలను విడిపించుకోలేక అమ్మేసుకున్న వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. లోన్లకు వడ్డీలు కట్టలేక, గడువు ముగిసిపోతుండటంతో అప్పట్లో అమ్మేసిన వారు.. ఇప్పుడు అదే బంగారాన్ని మళ్ళీ కొనాలంటే డబుల్ రేటు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు కష్టకాలంలో ఆదుకుంటుందని దాచుకున్న పసిడి, ఇప్పుడు మధ్యతరగతి కలలకి అందనంత దూరంగా వెళ్ళిపోయింది.

​తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నప్పటికీ, పెరుగుదల మాత్రం భారీగానే ఉంది. సామాన్యుడి పెళ్ళిళ్ల సీజన్ వస్తుండటంతో ఈ రేట్లు చూసి పేద కుటుంబాలు బెంబేలెత్తిపోతున్నాయి. ఒక్క రోజులోనే 24 క్యారెట్ల బంగారంపై రూ.3,220 పెరగడం అంటే సామాన్యమైన విషయం కాదు.

వెండి ధర కూడా కేజీకి నాలుగు లక్షలు కావడంతో సామాన్య భక్తులు సైతం వెండి వస్తువులను కొనేందుకు వెనకాడుతున్నారు. ​బంగారం అంటే కేవలం పెట్టుబడి మాత్రమే కాదు, మధ్యతరగతి సెంటిమెంట్ కూడా. కానీ ఇప్పుడు ఆ సెంటిమెంట్ కంటే సంక్షోభమే ఎక్కువగా కనిపిస్తోంది. అమ్మేసిన వారు ఇప్పుడు బాధపడుతుంటే, కొనే స్థోమత లేక మరికొందరు నిట్టూరుస్తున్నారు.