ఏపీలో వైద్య విద్య పరీక్షలలో నిఘా ఏర్పాటు చేశారు. వైద్య విద్యను అభ్యసిస్తున్న వారు ఇక నుంచి సీసీ కెమెరాల నీడన పరీక్షలు రాయాల్సి ఉంటుంది. వైద్య విద్య పరీక్షల్లో పారదర్శకతను మరింత పెంచే దిశగా ఈ చర్చలు తీసుకున్నారు. ఈ రోజు ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో ‘రిమోట్ కమాండ్ కంట్రోల్ సెంటర్’ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. రాష్ట్రంలోని 37 ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో నిర్వహించే యూజీ, పీజీ మెడికల్ వార్షిక, సప్లిమెంటరీ పరీక్షలను సీసీ కెమెరాల ద్వారా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
గతంలో పలు కళాశాలలలో కాపీయింగ్, మాల్మాల్ప్రాక్టీస్ వంటి అక్రమాల జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. వీటికి అడ్డు కట్ట వేసేందుకు ఈ ఏర్పాటు చేశారు. పరీక్షలు జరిగే ప్రతి గదిలోని సీసీ కెమెరాలను నేరుగా యూనివర్సిటీలోని కమాండ్ కంట్రోల్ రూముతో అనుసంధానం చేశారు. అన్ని కోర్సులు కలిపి ఏడాదికి సుమారు 60 వేల మంది విద్యార్థులు యూనివర్సిటీ ద్వారా జరిగే పరీక్షలకు హాజరవుతున్నారు.
పరీక్షల సమయంలో విద్యార్థుల కదలికల దృశ్యాలు కమాండ్ కంట్రోల్ రూములోని కంప్యూటర్లలో 70 రోజుల వరకు భద్రపరచేలా ఏర్పాట్లు చేశారు. రికార్డింగ్ చెడిపోకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి వైద్య కళాశాలలో సగటున 25 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా, కమాండ్ కంట్రోల్ రూములో ఆరు స్క్రీన్ల వీడియో వాల్, పది కంప్యూటర్లు ఉన్నాయి. సీసీ కెమెరాలు పనిచేయకపోతే ఏఐ సాయంతో వెంటనే సమాచారం అందేలా వ్యవస్థ రూపొందించారు. ఇంటర్నెట్ అంతరాయం ఉన్న సమయంలోనూ పరీక్షల దృశ్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.
ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ కార్యకలాపాలను ఓరిగో బిజ్ సొల్యూషన్స్ పర్యవేక్షించనుండగా, దూరాంక్ సంస్థ సాఫ్ట్వేర్ అందించింది. కేంద్రం ఏర్పాటుకు సుమారు రూ.30 లక్షలు ఖర్చు కాగా, రెండేళ్ల నిర్వహణకు రూ.1.5 కోట్లు వ్యయం అవుతుంది. మొదటగా ఎంబీబీఎస్, పీజీ పరీక్షలను పర్యవేక్షించగా, దశలవారీగా డెంటల్, ఆయుర్వేద, హోమియో, నర్సింగ్ తదితర కోర్సుల పరీక్షలనూ ఈ వ్యవస్థ పరిధిలోకి తీసుకు రానున్నట్లు అధికారులు తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates