వీధి శునకాలను అకారణంగా చంపుతున్నారని నటి రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబడుతూ ఆమె ఘాటుగా విమర్శలు చేశారు. హైదరాబాద్ ప్రెస్క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కుక్కల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి వాటిని చంపడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు.
రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనాల తయారీ కంపెనీలను మూసేస్తున్నారా? దోమ కాటుతో మరణాలు జరుగుతున్నాయని దోమలన్నిటినీ చంపేస్తారా? రేప్లు జరుగుతున్నాయని మగవాళ్లందరినీ చంపేస్తారా? మద్యం తాగి చాలామంది ఆక్సిడెంట్లు చేస్తున్నారు.. మరి వైన్ షాపులను మూసివేస్తారా.. అంటూ ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు.
వందలో ఐదు కుక్కలు మాత్రమే అగ్రెసివ్గా ఉంటే, వాటి కారణంగా మిగతా కుక్కలన్నింటినీ చంపేయడం సరికాదన్నారు. గూగుల్లో వెతికితే రోజుకు రోడ్డు ప్రమాదాలు, దోమ కాట్లు, కుక్కల వల్ల జరిగే మరణాల గణాంకాలు స్పష్టంగా కనిపిస్తాయని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ పరిసరాల్లో ఇప్పటికే 400 స్టెరిలైజ్డ్ కుక్కలను అకారణంగా చంపేశారని రేణు దేశాయ్ ఆరోపించారు. ఆ కుక్కలకు మాట్లాడే అవకాశం లేకపోవడంతోనే ఈ దారుణాలు జరుగుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క కుక్క తప్పు చేస్తే వంద కుక్కలను చంపడం ఎక్కడ న్యాయమని ప్రశ్నించారు. పిచ్చి కుక్కలుంటే వాటిని తమకు అప్పగించాలని తాను వాటిని చూసుకుంటాము అని అన్నారు.
తాను అనాథ పిల్లలకు సేవ చేస్తున్నా ఎప్పుడూ దానిని ప్రచారం చేసుకోలేదన్నారు. అనాథ పిల్లలు కోరిన భోజనం అడిగి మరీ పెడతానని చెప్పారు. కుక్కల గురించి మాట్లాడే వారిలో ఎంతమంది తోటి మనుషులకు సాయం చేస్తున్నారని కూడా ఆమె నిలదీశారు.
వీధివీధికీ మద్యం దుకాణాలు ఉండి, తాగి ప్రమాదాలు చేసి, ఇంటికి వెళ్లి భార్యలను కొడుతున్న ఘటనలపై ఎందుకు నిరసన తెలపడం లేదని ప్రశ్నించారు. ఈ సమావేశంలో యాంకర్ రష్మితో పాటు పలువురు జంతు ప్రేమికులు పాల్గొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
