రీల్స్‌లో బిల్డప్.. రియాలిటీలో మోసం

సోషల్ మీడియాలో ఇటీవల కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్లు లక్కీ డ్రాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. కార్లు, బైకులు, ప్లాట్లు, ఖరీదైన గాడ్జెట్లు ఇస్తామని రీల్స్ చేసి, అమాయకులను ఆకర్షిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది.

ఇంతకుముందు బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లతో డబ్బులు చేసుకున్న ఈ ఇన్‌ఫ్లుయెన్సర్లు, ఇప్పుడు అదే మోసాన్ని లక్కీ డ్రాల రూపంలో కొనసాగిస్తున్నారు. భారీ బహుమతులు గెలుస్తారని నమ్మించి, చిన్న మొత్తాలు చెల్లించమని చెప్పి ప్రజల ఆశలను ఆసరాగా చేసుకుంటున్నారు.

ఈ తరహా లక్కీ డ్రాలు చట్టవిరుద్ధమని, ప్రజలను మోసం చేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. Prize Chits and Money Circulation Schemes Banning Act 1978 ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

మోసాలకు పాల్పడేవారు సెలబ్రిటీలైనా, సోషల్ మీడియా స్టార్లైనా ఎవరినీ వదిలిపెట్టేది లేదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. పాపులారిటీని అడ్డం పెట్టుకుని ప్రజల నుంచి డబ్బులు దోచుకుంటే చట్టం ముందు తప్పించుకునే అవకాశం ఉండదన్నారు.

ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, లక్కీ డ్రాలు, భారీ బహుమతుల పేరుతో వచ్చే ఆఫర్లను నమ్మి డబ్బులు చెల్లించవద్దని అధికారులు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో కనిపించే హడావుడికి మోసపోకుండా, నిజమైన సమాచారం తెలుసుకుని మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.