భార్యతో వలపు వల… 100 వీడియోలు తీసిన భర్త

ఇటీవల కాలంలో వెలుగు చూస్తున్న క్రైం కథనాలు చూస్తే షాక్ కు గురి కావాల్సిందే. ఇలా కూడా చేస్తారా? అన్న ప్రశ్న వేసుకునే వేళ.. మారిన కాలంలో విలువలు పాతాళానికి చేరిన వేళ.. ఇలానే కాదు ఏమైనా చేసే కొందరు దుర్మార్గులు మన చుట్టూనే ఉంటారన్న విషయాన్ని గుర్తు పెట్టుకొని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నది మర్చిపోకూడదు.

సోషల్ మీడియాలో పురుషుల మీద వలపు వల విసిరి.. వారిని ముగ్గులోకి దించే భార్య.. వారి ప్రైవేటు భాగోతాన్ని హెచ్ డీ క్వాలిటీ ప్రింట్ తో రికార్డు చేసే భర్త.. వెరసి తమకు చిక్కిన వారి నుంచి లక్షలాది రూపాయిలు దోచేసే ఈ దంపతుల భాగోతం ఎక్కడో కాదు.. కరీంనగర్ లో చోటు చేసుకోవటం గమనార్హం.

ఈ తరహా నేరాలు అక్కడెక్కడో అల్లంత దూరాన జరిగి.. వాటిని వార్తలుగా చదివే పరిస్థితి. ఇటీవల కాలంలో ఇలాంటివన్నీ మన చుట్టూనే తిరుగుతున్న దుస్థితి. ఇంతకూ అసలేం జరిగిందంటే.. మంచిర్యాల జిల్లా వెంకటరావుపేటకు చెందిన ఒక వ్యక్తి మార్బుల్ వ్యాపారాన్ని కరీంనగర్ కు వచ్చి మొదలు పెట్టాడు. మంచిర్యాలకు చెందిన ఒక మహిళను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలున్నారు.

మార్బుల్ వ్యాపారంలో నష్టాలు రావటంతో ఇంటీరియర్ వర్కు చేయటం మొదలు పెట్టాడు. ఈ బిజినెస్ కోసం బ్యాంకులో రుణం తీసుకొని కరీంనగర్ లోని ఒక అపార్టుమెంట్ లో ప్లాట్ కొన్నాడు. ఇంటీరియర్ వ్యాపారంలోనూ నష్టాలు రావటంతో బ్యాంకు ఈఎంఐ కట్టటం కష్టంగా మారింది. ఈ ఆర్థిక సమస్యల్ని అధిగమించేందుకు దుర్మార్గమైన ప్లాన్ వేశారు.

సోషల్ మీడియా ద్వారా యువకులు.. వ్యాపారులను ఆకర్షించేలా భార్య చేత ప్రకటనలు చేయించేవాడు. వాటికి ఆకర్షితులైన వారితో ఆమె ఫోన్ చేసి మాట్లాడేది. తమ పథకంలో భాగంగా వారిని ముగ్గులోకి దింపి.. అపార్టుమెంట్ లోని ఫ్లాట్ కు ఆహ్వానించి గడిపేది. అయితే.. ఈ తతంగం మొత్తాన్ని భర్త రహస్యంగా రికార్డు చేసేవాడు.

ఆ తర్వాత వారికి ఫోన్ చేసి.. శాంపిల్ వీడియో పంపి గుండెలు అదిరేలా చేసేవారు. వారిని బ్లాక్ మొయిల్ చేసి లక్షలాది రూపాయిలు దండుకునేవారు. మూడేళ్ల వ్యవధిలో దాదాపు వంద మందిని ఈ తీరులో బ్లాక్ మొయిల్ చేసినట్లుగా గుర్తించారు. ఏడాది క్రితం కరీంనగర్ కు చెందిన ఒక వ్యాపారి వీరికి బాధితుడిగా మారి.. లక్షలాది రూపాయిలు చెల్లించినప్పటికి వారు వదలక.. మరింత డబ్బుల్ని డిమాండ్ చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో బాధితుడి కుటుంబ సభ్యుల సహకారంతో పోలీసులను ఆశ్రయించటంతో ఈ దంపతుల దుర్మార్గం వెలుగు చూసింది. ఎప్పటిలానే సదరు మహిళ విసిరిన వలపువలలో చిక్కుకున్న వ్యాపారి.. ఆమెతో ఏకాంతంగా గడిపాడు. ఆ వీడియోలను చూపించి అతడ్ని బెదిరించటం షురూ చేశారు. విడతల వారీగా రూ.13 లక్షలు ఇచ్చాడు. మళ్లీ.. రూ.5 లక్షలు అవసరమని బెదిరింపులకు దిగటంతో రూ.లక్ష ఇచ్చాడు. మిగిలిన రూ.4 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో బాధిత వ్యాపారి స్పందించలేదు.

ఈ నేపథ్యంలో.. ఆ వీడియోలను కుటుంబ సభ్యులకు.. సోషల్ మీడియాలో షేర్ చేస్తామని.. చంపుతామని బెదిరింపులకు దిగారు. వీరి తీరుకు భయపడిన సదరు బాధితుడు.. ఇంట్లో వారికి విషయాన్ని చెప్పేసి తన తప్పును ఒప్పుకున్నాడు. కుటుంబ సభ్యుల సహకారంతో పోలీసుల్నిఆశ్రయించి.. జరిగిన మొత్తం వ్యవహారాన్ని వివరించటంతో షాక్ తిన్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఈ దంపతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించగా..వారు మొత్తం వంద మందిని మోసం చేసినట్లుగా గుర్తించారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.