సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖలు, బీజేపీ నేతపై కేసు

మతపరమైన అంశాలపై  వ్యాఖ్యలు మరోసారి వివాదానికి దారితీశాయి. ప్రజలు భక్తి ప్రపత్తులతో కొలుచుకునే వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత కేసులు ఎదుర్కోవడం తరచుగా జరుగుతోంది. తాజాగా  షిరిడీ సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పులువురిపై కేసులు నమోదయ్యాయి.

నటి మాధవీ లతపై ఎఫ్ఐఆర్ చేశారు. పలువురు యూట్యూబర్లపై కూడా కేసులు ఫైల్అయ్యాయి. వీరంతా సరూర్ నగర్ లో విచారణలకు కావాలని ఆదేశించారు. మాధవీలత ఒక్కరిపైనే కాకుండా, ఆమె వ్యాఖ్యలకు మద్దతుగా ఇంటర్వ్యూలు నిర్వహించి వీడియోలను వైరల్ చేసిన కొందరు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై కూడా కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి మంగళవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని అందరికీ నోటీసులు జారీ చేశారు.

హిందూ దేవుళ్లపై తరచూ ఇటువంటి వ్యాఖ్యలనే కొందరు చేస్తున్నారు. భావప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇతరుల మతపరమైన నమ్మకాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం చట్టపరంగా నేరమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇటువంటి చర్యలపై ఐటీ చట్టాలు, ఇతర సంబంధిత సెక్షన్ల కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కూడా. అయినా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వార్తల్లో నిలవడం పరిపాటిగా మారింది.

సమాజంలో గుర్తింపు ఉన్న వ్యక్తులు మాట్లాడేటప్పుడు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సెలబ్రిటీలు లేదా సోషల్ మీడియాలో ఎక్కువ మంది అనుసరించే వ్యక్తులు చేసే వ్యాఖ్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఇవ్వకూడాదనేది పోలీసుల వాదన.

తెలుగమ్మాయి అయిన మాధవీలత  నచ్చావులే, స్నేహితుడా తదితర సినిమాల్లో హీరోయిన్‌గా చేసి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆ తర్వాత నటనను పూర్తిగా పక్కన పెట్టింది, బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తోన్న మాధవీలత ఇటీవల సోషల్ మీడియాలో షిరిడీ సాయిబాబాపై ఒక పోస్ట్ పెట్టింది ఇప్పుడు ఆ పోస్టులే నటిని ఇబ్బందుల్లోకి నెట్టాయి.