‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ ఇస్తే తీసుకెళ్లి..

అంతర్జాతీయ క్రికెట్లో అప్పుడప్పుడూ కొన్ని ఆసక్తికర ఉదంతాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఒక సీనియర్ ఆటగాడికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లేదా ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు ఇస్తే.. వాటికి తమ కంటూ జూనియర్లు అర్హులని, వారిదే మెరుగైన ప్రదర్శన అని కొందరు సీనియర్లు వాళ్ల చేతిలో పెట్టేస్తుంటారు. ఇలాంటి ఉదంతాలు అరుదుగానే జరుగుతుంటాయి. చాలా కాలం తర్వాత అలాంటి దృశ్యం.. భారత్-ఆస్ట్రేలియా టీ20 సిరీస్ ముగింపు సందర్భంగా చోటు చేసుకుంది.

భారత జట్టు 2-1తో సిరీస్‌ను గెలుచుకోవడంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా రెండో టీ20లో అతడి మెరుపు ఇన్నింగ్సే జట్టును గెలిపించింది. తొలి టీ20లోనూ అతను చెప్పుకోదగ్గ ఇన్నింగ్సే ఆడాడు. ఈ నేపథ్యంలోనే అతడికి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ ఇచ్చారు. కానీ అతను మాత్రం ఆ అవార్డుకు తాను అర్హుడిని కాదు అనేశాడు.

ఈ సిరీస్‌తోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టి వరుసగా మెరుపు బౌలింగ్ ప్రదర్శనలతో అందరి దృష్టినీ ఆకర్షించిన తమిళనాడు లెఫ్టార్మ్ పేసర్ నటరాజన్‌కు హార్దిక్ తన ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ ఇచ్చేశాడు. తొలి రెండు టీ20ల్లో రెండు చొప్పున వికెట్లతో నటరాజన్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. రెండో టీ20లో హార్దిక్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కగా.. అప్పుడే అతను ఇందుకు తాను కాదు, నటరాజనే అర్హుడు అని వ్యాఖ్యానించాడు.

మిగతా బౌలర్లందరూ విఫలమైన పిచ్ మీద ఎంతో పొదుపుగా బౌలింగ్ చేయడమే కాక రెండు కీలక వికెట్లు తీసిన నటరాజన్‌కే ఆ అవార్డు దక్కాలన్నాడు. ఇక మూడో టీ20లో భారత్ ఓడినప్పటికీ సిరీస్ సొంతం కాగా.. బహుమతి ప్రదానోత్సవంలో తనకు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారం అందిస్తే దాన్ని తీసుకెళ్లి నేరుగా నటరాజన్ చేతిలో పెట్టేసి తన క్రీడా స్ఫూర్తిని చూపించాడు. ఇలాంటి టీమ్ స్పిరిట్, పెద్ద మనసు అందరికీ ఉండదంటూ హార్దిక్ మీద సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.