సౌతాఫ్రికా సిరీస్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు మ్యాచ్ల్లో రెండు సెంచరీలతో ఏకంగా 302 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. ఈ అనూహ్యమైన ఫామ్ చూస్తుంటే క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వంద సెంచరీల రికార్డును కోహ్లీ అందుకుంటాడా అనే చర్చ మళ్లీ మొదలైంది. దీనిపై లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కోహ్లీకి వంద సెంచరీలు కొట్టడం పెద్ద కష్టమేమీ కాదని గవాస్కర్ తేల్చి చెప్పారు. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 84 అంతర్జాతీయ సెంచరీలు ఉన్నాయి. సచిన్ రికార్డు సమం చేయాలంటే మరో 16 కావాలి. గవాస్కర్ లెక్క ప్రకారం.. కోహ్లీ మరో మూడేళ్లు క్రికెట్ ఆడితే చాలు, ఈజీగా ఈ మైలురాయిని చేరుకుంటాడు. మొన్నటి సిరీస్లో రెండు కొట్టాడు, రేపు న్యూజిలాండ్తో మరో రెండు కొడితే 87 అవుతాయి. అలా చూసుకుంటే వంద కొట్టే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉందని గవాస్కర్ జోస్యం చెప్పారు.
వైజాగ్లో కోహ్లీ ఆడిన తీరు చూసి గవాస్కర్ ఫిదా అయ్యారు. వన్డేల్లో కోహ్లీని ఇలాంటి ‘టీ20 అవతారం’లో చూడటం చాలా అరుదని అన్నారు. గెలుపు ఖాయమైన మ్యాచ్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా కోహ్లీ చెలరేగిపోయాడు. మొదటి బంతి నుంచే షాట్లు ఆడుతూ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కానీ అందులో ఒక్కటి కూడా రిస్క్ షాట్ లేదు.
“అసలు అతని ఇన్నింగ్స్లో ఒక్కటంటే ఒక్క ఇన్ సైడ్ ఎడ్జ్ గానీ, అవుట్-సైడ్ ఎడ్జ్ గానీ కనిపించిందా? ఎవరైనా చెప్పగలరా?” అని గవాస్కర్ ప్రశ్నించారు. అంటే అంత పర్ఫెక్ట్గా, క్లాసీగా కోహ్లీ బ్యాటింగ్ చేశాడని ఆయన ఉద్దేశం. ప్రస్తుతం కోహ్లీ ఉన్న టచ్ చూస్తుంటే ఆల్ టైమ్ రికార్డులు బద్దలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే నెలలో న్యూజిలాండ్తో జరిగే సిరీస్లో కోహ్లీ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates