రోహిత్ నెగ్గుతాడా? తగ్గుతాడా?

గత కొన్ని రోజులుగా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇద్దరు కూడా 2027 వరల్డ్ కప్ వరకు ఉంటే మంచిదనే అభిప్రాయాలు వస్తున్నాయి. జట్టుకు సీనియర్ల అనుభవం కావాలని కొందరు అంటుంటే.. మరికొందరు యువ జట్టును సిద్ధం చేయాలని మరికొందరు చెబుతున్నారు. ఈ క్రమంలో రోహిత్, విరాట్ ఎటు తేల్చలేని ఆలోచనలో పడ్డారు. అయితే విరాట్ 2011 వరల్డ్ కప్ లో ఉన్నాడు. రోహిత్ శర్మ ఖాతాలో అది లేదు. టీ20 ఉన్నా 50 ఓవర్స్ వరల్డ్ కప్ తక్కువైంది. 

ఇక హఠాత్తుగా టీమిండియా కొత్త మార్పుతో హడావిడి మొదలైంది. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కి పగ్గాలు అప్పగించడంపై సోషల్ మీడియాలో ఊహించని రియాక్షన్‌లు వస్తున్నాయి. ఇది సరైన సమయమా? రోహిత్ లాంటి సీనియర్‌ని పక్కన పెట్టడం కరెక్ట్ కాదు.. అంటూ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మీమ్స్, ట్రోల్స్‌తో ట్విట్టర్ మండి పోతోంది. కానీ రోహిత్ మాత్రం బయటకు ఎలాంటి రియాక్షన్ ఇవ్వకపోయినా, అతని మనసులో మాత్రం మరో వరల్డ్‌కప్ గెలిపించాలన్న కోరిక మాత్రం ఇంకా బలంగానే ఉందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.

రోహిత్‌ కెప్టెన్సీలో భారత్‌ ఎన్నో విజయాలు సాధించింది. కానీ అతనికి ఒక్క కోరిక మాత్రం నెరవేరలేదు వరల్డ్‌కప్ గెలిపించడం. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్‌ దగ్గరే కల సాకారం కాలేదు. ఆ బాధతో కూడా రోహిత్ ఆటను కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు గిల్‌కి కెప్టెన్సీ ఇవ్వడం అంటే రోహిత్‌కి ముందే ‘రిటైర్మెంట్ సిగ్నల్’ ఇచ్చినట్లేనా అనే డౌట్ ఫ్యాన్స్ మధ్య ఊపందుకుంది.

ఇక మరో వైపు ఇర్ఫాన్ పఠాన్ చెప్పిన మాటలు కూడా చర్చకు దారితీశాయి. రోహిత్, కోహ్లీ 2027 వరల్డ్‌కప్‌ ఆడాలంటే మ్యాచ్ ప్రాక్టీస్, ఫిట్‌నెస్ రెండూ సమతౌల్యం కావాలన్నారు. ఇప్పటికే టెస్టులు, టీ20లకు దూరమయ్యారు. ఈ క్రమంలో దేశవాళీ క్రికెటర్ ఆడకపోవడం వల్ల మ్యాచ్ టచ్‌ కోల్పోతారని హెచ్చరించారు. రోహిత్‌ నిజంగా ఆ వరల్డ్‌కప్‌ కోసం ప్లాన్ చేస్తున్నట్లయితే, దేశవాళీ క్రికెట్‌ ఆడటమే ఒక్క మార్గమని ఇర్ఫాన్ సూచించాడు. మరి ఈ సమయంలో రోహిత్ లోకల్ మ్యాచ్ లు ఆడి నెగ్గుతాడా? లేదంటే చేతులెత్తేసి రిటైర్మెంట్ తో తగ్గుతాడా? అన్నది ఆసక్తిగా మారింది.