ఈ టైమ్ లో ఐసీసీ చర్యలు తీసుకుంటే..?

ఆసియా కప్‌ సూపర్ 4లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ ఆటగాళ్లు ప్రదర్శించిన హావభావాలు ఇప్పుడు పెద్ద వివాదంగా మారాయి. ఫర్హాన్‌ హాఫ్‌ సెంచరీ తర్వాత ‘గన్‌షాట్‌’ లాంటి సెలబ్రేషన్‌ చేయడం, హారిస్‌ రవూఫ్‌ మాత్రం ‘జెట్‌ ఫ్లైట్‌ కూల్చినట్లు’ 6, 0 సైగలు చూపించడం విస్తృతంగా విమర్శలు తెచ్చాయి. భారత్‌పై నేరుగా వ్యతిరేకత వ్యక్తం చేసేలా ఈ చర్యల్ని ఫ్యాన్స్‌ చూశారు. దీంతో బీసీసీఐ అధికారికంగా ఐసీసీకి ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదు ప్రకారం, పాక్‌ ఆటగాళ్లు రెచ్చగొట్టే ప్రవర్తన ప్రదర్శించారని, ఇది ఆట ఆత్మకు విరుద్ధమని పేర్కొంది. దీంతో ఐసీసీ ఆ ఇద్దరు ఆటగాళ్ల నుంచి లిఖితపూర్వక వివరణ కోరే అవకాశం ఉంది. వారు సరైన సమాధానం ఇవ్వకపోతే ఎలైట్‌ ప్యానెల్‌ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్‌ ఎదుట హాజరై వాదనలు వినిపించాల్సి రావచ్చు.

ఈ పరిస్థితుల్లో పాక్‌ క్రికెట్‌ బోర్డు కూడా వెనుకడుగు వేయడం లేదు. ఇప్పటికే సూర్యకుమార్‌ యాదవ్‌పై పలు వ్యాఖ్యల ఆరోపణలతో ఐసీసీకి ఫిర్యాదు చేసింది. పహల్గాం ఉగ్రదాడి బాధితులకు గెలుపుని అంకితం చేసిన వ్యాఖ్యలు తన దేశాన్ని టార్గెట్‌ చేశాయంటూ ఆరోపించింది.

అయితే క్రికెట్‌ వర్గాల్లో మరో ఆందోళన వినిపిస్తోంది. ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంటే, పాక్‌ ఆటగాళ్లు మళ్లీ లేనిపోని అనుమానాలు క్రియేట్‌ చేసి కావాలనే మమ్మల్ని టార్గెట్ చేశారని అడ్వాంటేజ్ గా తీసుకునే అవకాశముందని కొందరు భావిస్తున్నారు. పైగా ఐసీసీ చైర్మన్‌గా ప్రస్తుతం మాజీ బీసీసీఐ కార్యదర్శి జై షా ఉన్నారు. ఈ కారణంగా పాక్‌ మీడియా తప్పుగా ప్రాజెక్ట్‌ చేసి మరోసారి వివాదాన్ని పెద్దది చేయవచ్చని అంచనాలు ఉన్నాయి.

ప్రస్తుతం ఫ్యాన్స్‌ దృష్టి అంతా ఐసీసీ నిర్ణయంపైనే ఉంది. ఒకవైపు ఆటగాళ్ల ప్రవర్తనపై చర్యలు తీసుకోవాలనే ఒత్తిడి ఉంది. మరోవైపు రాజకీయ రంగు ఎక్కేలా పరిస్థితి తయారవుతుందేమోనన్న ఆందోళన కూడా ఉంది. ఇలాంటి సమయంలో ఐసీసీ తీసుకునే తుది నిర్ణయం ఆసియా కప్‌ కంటే కూడా పెద్ద చర్చగా మారే అవకాశం ఉంది.