భార్య చికెన్ వండలేదని ఒకరు.. బతకాలని లేదని మరొకరు సూసైడ్

చిన్న కారణాలకే విలువైన ప్రాణాల్ని తీసుకుంటున్న ఉదంతాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. తమ బలవన్మరణాలతో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తున్న వారు అంతకంతకు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు వెలుగు చూసిన రెండు ఉదంతాలు ఈ కోవకు చెందుతాయి. భార్య చికెన్ సరిగా వండలేదన్న కోపంతో జరిగిన గొడవతో మనస్తాపానికి గురైన ఒకరు ఆత్మహత్య చేసుకుంటే..మరొకరు జీవితం మీద విరక్తి కలుగుతోందని చెప్పిన ఆత్మహత్య చేసుకున్న ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని ఉదంతం విస్తుపోయేలా చేస్తోంది ఈ రెండు ఉదంతాలు ఆంధ్రప్రదేశ్ లోని వేర్వేరు జిల్లాల్లో చోటు చేసుకున్నాయి.

యర్రగొండపాలెం గ్రామానికి చెందిన పాతికేళ్ల లక్ష్మీనారాయణ భార్య వంటకాల మీద గొడవ పడ్డాడు. నిత్యం పచ్చడి అన్నం పెడుతోందని ఫిర్యాదు చేస్తూ.. గొడవ పడ్డాడు. చికెన్ వండాలని కోరినా ఆమె అందుకు స్పందించకపోవటం.. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన లక్ష్మీ నారాయణ పొలానికి వెళ్లి.. అక్కడ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మరో ఉదంతం గుంటూరులో చోటు చేసుకుంది.

ఏలూరు జిల్లాలోని శ్రీరామవరం గ్రామానికి చెందిన శ్రావ్య వీవీఐటీ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. గుంటూరు అశోక్ నగర్ లోని నవీన లేడీస్ హాస్టల్ లో ఉంటోంది. తనకు బతకాలని అనిపించట్లేదని.. ఆత్మహత్య చేసుకోవాలంటూ తన స్నేహితురాలికి ఫోన్ చేసి చెప్పింది. బాగా చదువుతున్నావు.. సమస్యలు ఏమైనా ఉంటే సాయం చేస్తానని ధైర్యంగా చెప్పిన ఆమె.. శ్రావ్య సోదరుడి ద్వారా తల్లిదండ్రులకు తెలియజేసింది. వారు వెంటనే శ్రావ్యకు ఫోన్ చేసి పిచ్చి ఆలోచనలు చేయొద్దంటూ చెప్పి.. తాము వచ్చి తీసుకెళతామని చెప్పారు.

వాళ్లను రావొద్దని చెప్పిన శ్రావ్య.. దసరా సెలవులు ఇస్తారని గురువారం ఇంటికి వస్తానని చెప్పటంతో ఆమె స్నేహితులతో మాట్లాడి..జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అంతా బాగానే ఉందని అనుకున్నా.. రాత్రి వేళ రూమ్మేట్స్ కంటే ముందే నిద్ర పోతానని చెప్పిన శ్రావ్య.. నోటికి ప్లాస్టర్.. ముక్కుకు క్లిప్పు పెట్టుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం ఉదయం ఎంతసేపటికి నిద్ర లేవకపోటంతో ఆమె వద్దకు వెళ్లి చూడగా.. సూసైడ్ చేసుకుందన్న విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఒంటరితనమే కుంగదీసి ఆత్మహత్య చేసుకుందని భావిస్తున్నారు.