నో షేక్ హ్యాండ్… నేరుగా కౌంటర్ డోస్

ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్ లో భారత్ మరోసారి పాకిస్తాన్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. ఆకులా ఎగిరెగిరి పడిన పాక్ ఆటగాళ్లకు మన కుర్రాళ్ళు బ్యాట్ తోనే ధీటుగా సమాధానం ఇచ్చారు. మొదట బ్యాటింగ్ లో పరిగెత్తిన పాక్ ను డౌన్ చేయడానికి మనోళ్ళకు ఎంతో సమయం పట్టలేదు. మళ్ళీ నో షేక్ హ్యాండ్ పద్ధతిలోనే కౌంటర్ డోస్ పడింది.

172 పరుగుల టార్గెట్‌ను చేధించడంలో మన కుర్రాళ్లు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటారు. 18.5 ఓవర్లలో 174/4 స్కోరు చేసి 6 వికెట్ల తేడాతో గెలుపొందారు. పాక్‌ బ్యాటింగ్‌ ప్రారంభం నుంచే మన బౌలర్ల కట్టుదిట్టమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌ ఎదిరించలేక తడబడింది. ఓపెనర్‌ ఫఖర్‌ జమాన్‌ (15) త్వరగా ఔటయ్యాడు. తర్వాత సాహిబ్‌జాదా ఫర్హాన్‌ మాత్రం బాగా ఆడాడు. 45 బంతుల్లో 58 పరుగులు చేసి జట్టును నిలబెట్టాడు.

సైమ్‌ అయూబ్‌ (21), హుస్సేన్‌ తలత్‌ (10), నవాజ్‌ (21) కూడా కొంతమేర సహకరించారు. చివర్లో కెప్టెన్‌ సల్మాన్‌ అఘా (17 నాటౌట్‌), ఫహీమ్‌ అష్రఫ్‌ (20 నాటౌట్‌) ఆడటంతో స్కోరు 171/5కి చేరింది. భారత బౌలర్లలో శివమ్‌ దూబే 2 వికెట్లు, కుల్దీప్‌, వరుణ్‌, హార్దిక్ చెరో వికెట్ తీశారు.

ఇక టార్గెట్ కోసం భారత్‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు అభిషేక్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ కలిసి పాకిస్థాన్‌ బౌలర్లపై విరుచుకుపడ్డారు. అభిషేక్‌ 39 బంతుల్లో 74 పరుగులు (6 ఫోర్లు, 5 సిక్సులు) చేసి దూకుడుగా ఆడగా, గిల్‌ 28 బంతుల్లో 47 (8 ఫోర్లు) రాణించాడు. ఈ కాంబో తొలి వికెట్‌కి 105 పరుగులు జత చేసి మ్యాచ్‌ను ముందే మనవైపు తిప్పేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (0) త్వరగా ఔటైనా, తర్వాత తిలక్‌ వర్మ (30 నాటౌట్‌) శాంతంగా ఆడుతూ జట్టును గెలుపు దిశగా నడిపించాడు.

చివరగా 18.5 ఓవర్లలో టార్గెట్‌ను పూర్తి చేసిన భారత్‌ మరోసారి పాక్‌ను సులభంగా మట్టికరిపించింది. షాహీన్‌ అఫ్రిది, సైమ్‌ అయూబ్‌, హారిస్‌ బౌలింగ్‌ను మన బ్యాటర్లు చిన్నబుచ్చారు. హారిస్‌ రౌఫ్‌ మాత్రం 2 వికెట్లు తీసి కొంత మెరుగ్గా బౌలింగ్ చేశాడు. కానీ మొత్తంగా పాక్‌ బౌలర్లందరూ మన బ్యాట్స్‌మన్‌ల ఎదుట బలహీనంగానే కనిపించారు.

ఈ విజయంతో భారత్‌ సూపర్‌ 4లో ఫైనల్‌ బాటను మరింత సులభం చేసుకుంది. మరోవైపు పాక్‌ మాత్రం లీగ్ లో రెండోసారి భారత్ ముందు తలొగ్గక తప్పలేదు. ఇక పాక్ వక్రబుద్దికి తగ్గట్టుగా నో షేక్ హ్యాండ్ పద్దతిలో భారత ఆటగాళ్లు దేశానికి మద్దతుగా నిలుస్తూ స్పష్టమైన సందేశం ఇస్తున్నారని చెప్పవచ్చు. అలాగే నెక్స్ట్ పాక్, శ్రీలంక – బంగ్లాదేష్ లతో ఆడి గెలిస్తే ఫైనల్ లో టీమిండియాతో మరోసారి కొట్టించుకోక తప్పదని ఫ్యాన్స్ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.