పహల్గాం ఉగ్రదాడి… ఇండియన్ కెప్టెన్ క్లీన్ మెసేజ్

ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై ఘన విజయాన్ని అందుకున్న టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ తన మాటలతో అభిమానులను కట్టిపడేశాడు. దుబాయ్ వేదికగా ఆడిన మ్యాచ్‌లో అద్భుత విజయానంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు కేవలం క్రికెట్‌కే పరిమితం కాలేదు. ఈ సారి సూర్య తన గెలుపు సంతోషాన్ని పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు అంకితం చేయడం విశేషంగా మారింది.

మ్యాచ్ అనంతరం మాట్లాడిన సూర్య, “ఇది మా కోసం మరో గేమ్ మాత్రమే. కానీ ఈ ప్రత్యేక సందర్భంలో పహల్గాం ఉగ్రదాడి బాధితుల కుటుంబాల పక్కన నిలబడ్డామని చెప్పాలనుకుంటున్నాను. మా ఆర్మీ బలగాలు చూపిన ధైర్యసాహసాలకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం. మైదానంలో మా గెలుపుతో, వారి ముఖాల్లో చిరునవ్వు చూడాలని ఆశిస్తున్నాం” అని చెప్పి అందరినీ కదిలించాడు.

చివరి వరకు నిలబడి జట్టును గెలిపించడం తనకు ప్రత్యేక అనుభూతి అని తెలిపారు. ప్రతి మ్యాచ్‌ కోసం ఒకే విధమైన సన్నద్ధతతో ముందుకెళ్లడమే తమ తత్వమని చెప్పారు. స్పిన్నర్లు మధ్య ఓవర్లలో మ్యాచ్‌ను కట్టిపడేయడం ఎప్పటినుంచో తనకు ఇష్టమని తెలిపారు. భారత్ గెలుపుతో ఉత్సాహంగా ఉన్నా, సూర్య మాటల్లో ఒక గంభీరత స్పష్టంగా కనిపించింది. 

దేశం ఎదుర్కొంటున్న పరిస్థితులను గుర్తు చేస్తూ, ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఓదార్పునిచ్చేలా వ్యాఖ్యలు చేశారు. క్రీడ ద్వారా దేశానికి గౌరవం తీసుకురావడమే కాకుండా, సైన్యం ధైర్యాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్తామన్న సంకేతాన్ని ఇచ్చారు. మొత్తంగా చూస్తే, ఈ మ్యాచ్ విజయం కేవలం ఒక విజయమే కాదు. అది ఒక భావోద్వేగ అంకితం కూడా అని టీమిండియా క్లియర్ మెసేజ్ ఇచ్చింది.