ఏపీ మంత్రి నారా లోకేష్-బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. “ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్“గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్ అందుకున్నాడు. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో దేవాన్ష్ అవార్డ్ ను దక్కించుకున్నాడు. అవార్డ్ ప్రదానోత్సవ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి పాల్గొన్నారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని దేవాన్ష్ తాత, ఏపీ సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. తమ ఫ్యామిలీ ఛాంపియన్కు కంగ్రాట్స్ చెబుతున్నానని పేర్కొన్నారు.
ఏంటీ రికార్డు?
పదేళ్ల యువ చెస్ ప్రాడిజీ నారా దేవాన్ష్ చదరంగంలో అత్యంత క్లిష్టమైన 175 పజిల్స్ ను వేగంగా పరిష్కరించడం ద్వారా `ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్`గా ప్రపంచ రికార్డ్ సాధించాడు. ఈ క్రమంలో లండన్లో తాజాగా ఆయనకు “ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్-175 పజిల్స్” అవార్డ్ లభించింది. ఈ ఘనతను సాధించేందుకు నారా దేవాన్డ్ గతేడాది `చెక్ మేట్ మారథాన్` లో లాస్లో పోల్గార్ ప్రసిద్ధ చెస్ సంకలనం ‘5334 ప్రాబ్లమ్స్ అండ్ గేమ్స్’ పుస్తకం నుంచి తీసుకున్న 175 సంక్లిష్టమైన చెక్ మేట్ పజిల్స్ ను వేగవంతంగా పరిష్కరించాడు. ఈ పజిల్స్ ఒకటి తర్వాత ఒకటి కష్టంగా మారుతూ వేగం, కచ్చితత్వం, ఆలోచనా నైపుణ్యాలను పరీక్షిస్తుంది.
దేవాన్ష్ వీటన్నిటినీ అత్యంత తక్కువ సమయంలో పరిష్కరించడం ద్వారా రికార్డు సృష్టించాడు. ప్రపంచ చెస్ రంగంలో అత్యుత్తమ యువ ప్రతిభావంతుల్లో ఒకరుగా దేవాన్ష్ కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం లభించింది. ఈ విజయానికి దేవాన్ష్ అకుంఠిత శ్రమతో పాటు, కోచ్ కే. రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహం ఉండడం గమనార్హం. కాగా.. తన కుమారుడి విజయంపై నారా లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. “ఈ రోజు వెస్ట్మినిస్టర్ హాల్లో దేవాన్ష్ ఈ గౌరవాన్ని అందుకోవడం ప్రత్యేకమైంది. అతని ముందుచూపు, ఆలోచనాశక్తి, ఒత్తిడిలో ప్రదర్శించిన సమయస్పూర్తి, చిన్న వయస్సులోనే పూర్తిగా ఆటకు అంకితం కావడం వంటి విభిన్న శైలి వల్ల ఈ విజయం సాధ్యమైంది“ అని లోకేష్ పేర్కొన్నారు.
ఈ విషయంపైనే స్పందించిన సీఎం చంద్రబాబు.. తమ ఫ్యామిటీ ఛాంపియన్కు కంగ్రాట్స్ చెబుతున్నట్టు పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచి దేవాన్ష్కు ఛెస్పై ఆసక్తి ఎక్కువని.. దీనికి తగిన విధంగానే తాము ప్రోత్సహించినట్టు తెలిపారు. మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates