జీఎస్టీ స్లాబుల్లో తగ్గింపుల వలన వాహనాల మార్కెట్లో ఊహించని మార్పులైతే కనిపిస్తున్నాయి. ఈ నెల 22 నుంచి అమలులోకి రానున్న కొత్త రేట్లతో కార్లు, ద్విచక్ర వాహనాల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. దీని కారణంగా ప్రస్తుతం షోరూంల వద్ద ఖాళీ కుర్చీలు, బోసిన షోరూం హాల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. వినియోగదారులు కొత్త రేట్లు అమల్లోకి వచ్చే వరకు వేచి చూడాలని నిర్ణయించుకోవడంతో వాహన వ్యాపారులకు తాత్కాలికంగా భారీ దెబ్బ తగిలింది.
సాధారణంగా మధ్యతరగతి ప్రజలు ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేయడానికి పెద్ద సంఖ్యలో ముందుకు వస్తారు. కొత్త స్లాబుల్లో బైక్లపై 8 వేల నుంచి 20 వేల వరకు, కార్లపై 60 వేల నుంచి 1.5 లక్షల వరకు ధర తగ్గుతుందని అంచనా. దీంతో ఇప్పుడే కొనుగోలు చేయడంకన్నా కొద్ది రోజులు ఆగితే లాభమని ప్రజలు లెక్కలు వేసుకుంటున్నారు. ఈ నిర్ణయం వారికి ఊరటను ఇస్తున్నా, షోరూంల యజమానులకు మాత్రం ఈ రోజులు ఖాళీగా గడిచేలా చేస్తోంది.
దసరా పండుగ వాహనాల అమ్మకాలకే బంపర్ సీజన్. ఆ సెంటిమెంట్తో కలిపి ఈసారి జీఎస్టీ తగ్గింపులు చేరడంతో, దసరా వరకు భారీ డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. వాహనాలను పండగరోజు అందుకోవాలనుకునే వారు ముందస్తు బుకింగ్లు వేసే అవకాశం ఉండగా, మరికొందరు తక్కువ ధర కోసం చివరి నిమిషం వరకు ఆగే పరిస్థితి ఉంది. షోరూంల యజమానులు కూడా ఈ గ్యాప్ భర్తీ చేయడానికి ముందస్తు ఆఫర్లను ప్రకటిస్తూ కొనుగోలుదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
ఒకవైపు వినియోగదారులు లాభాలను లెక్కపెడుతుండగా, మరోవైపు వ్యాపారులు సరఫరాపై ఆందోళన చెందుతున్నారు. దసరా సమయానికి ఆర్డర్లు అమాంతం పెరిగిపోతే, అందరికి వాహనాలు అందించేలా స్టాక్ ఉండకపోవచ్చని భయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే కంపెనీలు కొత్త ధరలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తూ, సరఫరా వ్యవస్థను దృఢం చేయడానికి కృషి చేస్తున్నాయి. మొత్తం మీద, వాహనాల జీఎస్టీ తగ్గింపు వినియోగదారులకు లాభం అయినా, వ్యాపారులకు తాత్కాలిక నష్టంగా మారింది. అయితే దసరా సీజన్ నుంచి అమ్మకాలు ఊపందుకుని మళ్లీ షోరూంల వద్ద రద్దీ కనిపించడం ఖాయం.
Gulte Telugu Telugu Political and Movie News Updates