గిల్‌కి వన్డే కెప్టెన్సీ.. మరి రోహిత్ సంగతేంటీ?

భారత క్రికెట్‌లో మరో కీలక మార్పు చోటుచేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ను త్వరలోనే భారత వన్డే జట్టు కెప్టెన్‌గా ప్రకటించే అవకాశం బలంగా ఉంది. ఈ నిర్ణయంతో రోహిత్‌ శర్మ కెప్టెన్సీ ప్రయాణం ముగిసే దశకు చేరుకుంటుందన్న చర్చ మొదలైంది. ముఖ్యంగా రాబోయే ఆస్ట్రేలియా పర్యటన రోహిత్‌కి చివరి సిరీస్ కావచ్చని అనేక వర్గాలు భావిస్తున్నాయి.

గిల్‌ ఇప్పటికే టెస్టుల్లో జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. టీ20లోనూ వైస్ కెప్టెన్‌గా నియమించబడ్డాడు. ఇప్పుడు ఓడీఐల్లోనూ అతనికే నాయకత్వం ఇవ్వాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. 2027 వరల్డ్‌కప్ దృష్ట్యా కొత్త కెప్టెన్‌కు ముందుగానే సమయం ఇవ్వడం అవసరమని భావిస్తున్నారు. రోహిత్‌ మరోసారి వరల్డ్‌కప్ గెలిపించాలని కోరుకున్నా, ఆ నిర్ణయం ఇప్పుడు పూర్తిగా సెలెక్టర్ల చేతుల్లోనే ఉంది.

38 ఏళ్ల వయసులో రోహిత్‌ ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఫిట్‌నెస్, ఫామ్ రెండూ నిలబెట్టుకోవడం అతనికి కఠిన సవాలే. మరోవైపు, గిల్‌కి వయస్సు, ఫామ్ రెండూ అనుకూలంగా ఉన్నాయి. అందుకే బీసీసీఐ ఒక కెప్టెన్‌తో అన్ని ఫార్మాట్లను ముందుకు తీసుకెళ్లే వ్యూహం అవలంబించనుంది.

ఈ నిర్ణయం రోహిత్‌ – విరాట్‌ల భవిష్యత్తుపై పెద్ద ప్రశ్నల్ని లేవనెత్తింది. ఇద్దరూ టెస్ట్, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇప్పుడు వన్డే ఫార్మాట్‌లో ఉన్నారు. కానీ 2027 నాటికి రోహిత్‌ 40 ఏళ్లు దాటతాడు. ఇలాంటి సందర్భంలో గిల్‌నే భవిష్యత్‌ నాయకుడిగా గుర్తించడం సహజమేనని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు.

మొత్తానికి, ఆస్ట్రేలియా సిరీస్ రోహిత్‌ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పే వేదిక కావచ్చని కనిపిస్తోంది. ఇక గిల్‌కి ఓడీఐ జట్టు పగ్గాలు అప్పగించడం కేవలం సమయ సమస్య మాత్రమేనని స్పష్టమవుతోంది. ఇక అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో చూడాలి.