దేశంలోనే ప్రతిష్టాత్మక వారసత్వ కట్టడం.. ఏటా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగే.. ఎర్ర కోటలో భారీ దొంగతనం జరిగింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే.. ఎర్రకోటలో ఇలా చోరీ జరగడం ఇదే తొలిసారి అని పోలీసులు చెబుతున్నారు. దొంగను గుర్తించామని.. ఉత్తరాది రాష్ట్రాల్లోని ఆలయాల్లో తరచుగా దొంగతనాలకు పాల్పడే వ్యక్తే ఎర్రకోటలోనూ చోరీ చేసినట్టు తెలిపారు. దొంగ కోసం 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిశితంగా గాలిస్తున్నట్టు చెప్పారు.
ఏం జరిగింది?
ఎర్రకోటను గత ఐదేళ్లుగా ప్రైవేటు వ్యక్తులకు అద్దెకు ఇస్తున్నారు. ఏదైనా కార్యక్రమాలు నిర్వహించుకునే నిమిత్తం రోజుకు 2 లక్షల రూపాయల అద్దె ప్రాతిపదికన.. ఎర్రకోటను రెంటుకు ఇస్తున్నారు. దీనివల్ల ఆదాయం సమకూరుతుండడంతో పెళ్లిళ్లు, ఆథ్యాత్మిక కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. ఈ నెల 3న ఉత్తరాదికి చెందిన ప్రముఖ వ్యాపారి ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కుటుంబం కూడా హాజరైంది.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక పూజల కోసం.. మూడు బంగారు కలశాలను ఏర్పాటు చేశారు. పూజ ముగిసి.. అతిథులకు భోజనాలు వడ్డిస్తున్న సమయంలో అనూహ్యంగా ఈ బంగారు కలశాలు మాయమయ్యాయి. మరోవైపు.. కార్యక్రమం నిర్వాహకుడు, వజ్రాల వ్యాపారి.. సుధీర్ కుమార్ జైన్.. కూడా అతిథులను పలక రించడంలో నిమగ్నమయ్యారు. దీనినే అలుసుగా తీసుకున్న ఓ వ్యక్తి(పాత నేరస్తుడని పోలీసులు చెబు తున్నారు) సిక్కుల వేషధారణలో ప్రవేశించాడు.
ఎవరూ లేని సమయంలో పూజాగదిలోకి వెళ్లి.. కలశాలను సంచీలో పెట్టుకుని ఉడాయించాడు. చిత్రం ఏంటంటే.. సదరు వ్యక్తి భోజనం చేసిన తర్వాత.. ఈ దొంగతనానికి పాల్పడ్డట్టు పోలీసులు గుర్తించారు. మరోవైపు.. కేంద్ర హోం శాఖ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. ఎర్రకోటలో చోరీ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న నేపథ్యంలో దీనిని త్వరగాపరిష్కరించాలని ఢిల్లీ ప్రభుత్వానికి సూచించింది. ఇదిలావుంటే.. సుధీర్ కుమార్ జైన్ కు బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో కేంద్రం స్థాయిలో ఈ కేసును సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates