బ్యాంకు డబ్బుతో బెట్టింగ్ ఆడిన క్యాషియర్, చివరికి…

లక్కీ భాస్కర్ సినిమాలో క్యాషియర్ గా ఉండే హీరో బ్యాంక్ సొమ్ముతో అక్రమ వ్యాపారం చేసి కోటీశ్వరుడిగా మారిపోతాడు. రాంగ్ రూట్లోనే తెలివిగా డబ్బు సంపాదించి మ్యానేజ్ చేస్తూ అత్యాశకు పోతాడు. ఇక చివరికి విదేశాలకు వెళ్లి కథానాయకుడిగా గెలుస్తాడు. కానీ రియల్ లైఫ్ లో ఎప్పటికైనా అలాంటివి ప్రమాదమే అని నిరూపించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. రీసెంట్ గా  ఓకే బ్యాంక్ ఉద్యోగి కూడా లక్కీ భాస్కర్ రేంజ్ లో క్లిక్కవ్వాలని అనుకున్నాడో ఏమో గానీ ఏడాది పాటు మ్యానేజ్ చేసినా చివరికి చట్టానికి దొరికిపోయాడు.

మంచి విద్య, మంచి ఉద్యోగం ఉంటే జీవితం సుఖంగా సాగుతుందని అందరూ అనుకుంటారు. కానీ చెడు అలవాటు ఒక్కటే ఆ భవిష్యత్తును చీకటిలోకి నెట్టేస్తుంది. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఎస్‌బీఐ క్యాషియర్‌గా పని చేస్తున్న నరిగె రవీందర్‌ జీవితం అలాంటి ఉదాహరణ. ఇంజినీరింగ్ పూర్తి చేసి, మొదటి ప్రయత్నంలోనే జాతీయ బ్యాంకులో ఉద్యోగం దక్కించుకున్న రవీందర్‌ తన కష్టానికి ఫలితం అందుకున్నట్టే. కానీ ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనం అతన్ని మోసగాడిగా మార్చేసింది.

మొదట అప్పుల మాయలో పడిన రవీందర్‌ 2024లోనే 40 లక్షల వరకు లోన్స్ తీసుకున్నాడు. తన వాటా భూమిని తాకట్టుపెట్టి వాటిని తీర్చాడు. కానీ మళ్లీ బెట్టింగ్ మోజు వదలలేదు. చివరికి తానే పనిచేస్తున్న బ్యాంకు మీద కన్నేశాడు. శాఖలో రుణగ్రహీతలు తాకట్టుపెట్టిన బంగారు ఆభరణాలను బయటకు తీయడం మొదలు పెట్టాడు. దగ్గరి బంధువులు, స్నేహితుల పేర్లతో నకిలీ రుణ ఖాతాలు తెరిచాడు. ఈ క్రమంలో 42 ఖాతాల ద్వారా 4.14 కిలోల బంగారం లేకుండానే ఉన్నట్లు చూపించి 1.58 కోట్లు రుణం తీసుకున్నాడు. ఏటీఎంలలో జమ చేయాల్సిన డబ్బులోనూ కొంత కొంత భాగం మాయం చేసేవాడు.

సాధారణంగా బ్యాంకు క్యాషియర్ అంటే అందరూ నమ్మకం పెట్టుకుంటారు. రవీందర్‌ కూడా ఆ నమ్మకాన్ని వాడుకున్నాడు. స్నేహపూర్వకంగా ఉండడం, విధుల్లో చురుకుగా కనిపించడం వల్ల ఎవరూ డౌట్ పడలేదు. మేనేజర్‌, అటెండర్‌తో పాటు మరో 41 మందిని తన మాయలోకి దింపి, ఏడాది పాటు ఈ వ్యవహారాన్ని దాచిపెట్టగలిగాడు. కానీ చివరకు నిజం బయటపడింది. పోలీసులు మొత్తం 44 మందిని అరెస్టు చేసి, బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఇటీవలే భారత ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్‌ను నిషేధించింది. ఇదివరకే వీటి వ్యసనం ఇంకా చాలామందిని ముంచేసింది. డిజిటల్ మాయలో మనుషుల భవిష్యత్తులు ఇలా పాడు కావడం ఆందోళన కలిగించే విషయం. చెడు అలవాటు ఒకరి జీవితాన్ని మాత్రమే కాదు, కుటుంబం మొత్తాన్ని నాశనం చేస్తుందనే మరో ఘోర ఉదాహరణగా చెన్నూరు ఘటన నిలిచిపోయింది.