స్పర్శ తెలియక పాము కాటుకు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ మృతి

బెంగళూరులో చోటుచేసుకున్న ఒక విషాదకర ఘటన అందరినీ షాక్‌కు గురి చేసింది. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న 41 ఏళ్ల మన్జు ప్రకాశ్‌ తన ఇంటి వద్ద చెప్పులు వేసుకునే క్రమంలో పాముకాటు బారిన పడ్డాడు. అయితే అతనికి కాలి స్పర్శజ్ఞానం లేకపోవడంతో ప్రమాదాన్ని గుర్తించలేకపోయాడు. ఫలితంగా ప్రాణాలు కోల్పోయాడు.

ప్రకాశ్‌ టీసీఎస్‌లో పని చేస్తున్నాడు. ఆ రోజు ఇంటికి వచ్చి చెప్పులు (crocs) బయటే ఉంచి విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లాడు. చెప్పులో దూరిన రక్తపింజర అనే పాము పిల్ల అతన్ని కరిచింది. కానీ అతనికి 2016లో జరిగిన బస్‌ ప్రమాదం కారణంగా ఒక కాలులో స్పర్శ తగ్గిపోయింది. దీంతో పాముకాటు వేసినా కూడా అతనికి ఏం జరిగిందో తెలియలేదు. కొద్ది సేపటికే అస్వస్థతకు గురై మంచంపై పడిపోయాడు.

కొంతసేపటి తర్వాత ఇంటి వద్దకు వచ్చిన కార్మికుడు చెప్పుల దగ్గర చనిపోయిన పామును చూసి కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. ఆందోళన చెందిన వారు ప్రకాశ్‌ గదికి వెళ్లి చూడగా ఆయన నోటినుంచి నురగ రావడంతోపాటు కాలి వద్ద రక్తస్రావం కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు.

పాముకాటు గుర్తించలేకపోవడం ఈ ఘటనలో ప్రధాన కారణమని పోలీసులు తెలిపారు. పాము కరిచిన తర్వాత కొంతసేపు అది చెప్పులోనే చిక్కుకుపోయి చనిపోయింది. కాటు వేసిన వాస్తవం తెలిసినప్పటికీ, అప్పటికే ఆలస్యమైంది. ఈ సంఘటన స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. బన్నేరుఘట్ట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదై దర్యాప్తు జరుగుతోంది. చెప్పులు వేసే ముందు చెక్‌ చేయడం అలవాటు చేసుకోవాలని, పాముల కాటుతో ప్రాణాలు దురదృష్టవశాత్తూ ఇలా కోల్పోకుండా ఉండాలనే పోలీసులు సూచనలు చేస్తున్నారు.