బెట్టింగ్ యాప్స్ మోసంలో రూ.20,000 కోట్లు

భారతదేశంలో ఆన్‌లైన్ గేమింగ్ రంగం వేగంగా పెరుగుతున్నా, అదే వేగంతో సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం దాదాపు 45 కోట్ల మంది ఆటగాళ్లు రూ.20,000 కోట్లకు పైగా నష్టపోతున్నారని ప్రభుత్వ అంచనా. ముఖ్యంగా డబ్బుతో సంబంధమున్న బెట్టింగ్, జూదం తరహా గేమ్స్ కారణంగానే ఈ భారీ నష్టాలు వస్తున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లును ఆమోదించింది.

ఈ బిల్లులో ప్రధాన అంశం దేశవ్యాప్తంగా ఒక “ఆన్‌లైన్ గేమింగ్ అథారిటీ” ఏర్పాటు చేయడం. ఈ సంస్థ అన్ని గేమ్స్‌ను వర్గీకరిస్తుంది, డబ్బుతో సంబంధమున్న వాటిని గుర్తించి నమోదు చేస్తుంది. అంతేకాకుండా, మోసపూరితంగా నడుస్తున్న యాప్‌లు, గేమింగ్ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకునే అధికారం కూడా ఇస్తుంది. డబ్బుతో సంబంధమున్న గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లను నడిపితే మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ.1 కోటి జరిమానా లేదా రెండూ విధించబడతాయి. ఇలాంటి యాప్‌లను ప్రమోట్‌ చేసే వారికీ రెండేళ్ల జైలు లేదా రూ.50 లక్షల వరకు ఫైన్ ఉంటుంది.

ప్రభుత్వం ఈ చట్టంతో మూడు అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టింది. మొదటిది జూదం, బెట్టింగ్ తరహా డబ్బు గేమ్స్‌ మీద పట్టు. రెండవది ఈ స్పోర్ట్స్‌ను ప్రోత్సహించడం. మూడవది ఆన్‌లైన్ సోషల్ గేమ్స్‌కి చట్టబద్ధ గుర్తింపు ఇవ్వడం. ఈ స్పోర్ట్స్ అంటే పోటీగా జరిగే టోర్నమెంట్లు, లీగ్‌లు, ఇందులో పాల్గొన్న వారు ప్రైజ్ మనీ గెలుస్తారు. ఇది పరిశ్రమలో రెండు మూడవ వంతు వాటా కలిగి ఉండటంతో ప్రభుత్వం దీన్ని బలంగా ప్రోత్సహించాలని భావిస్తోంది. అలాగే మల్టీప్లేయర్ గేమ్స్ (ఫోర్ట్‌నైట్‌, మైన్‌క్రాఫ్ట్‌, కౌంటర్‌ స్ట్రైక్‌ వంటివి)ను సోషల్ మెసేజింగ్‌కి వాడుకోవాలని యోచిస్తోంది.

అయితే, ప్రభుత్వానికి మరో ప్రధాన ఆందోళన ఉంది. ఈ ఆన్‌లైన్ గేమ్స్ మనీ లాండరింగ్, టెర్రరిజం ఫండింగ్ కోసం వాడబడుతున్నాయనే అనుమానం. 2022 నుంచి ఇప్పటివరకు 1,500 కంటే ఎక్కువ అక్రమ గేమింగ్, బెట్టింగ్ వెబ్‌సైట్లు బ్లాక్‌ చేసినట్టు అధికారులు తెలిపారు. దీనికి తోడు, 2023 నుంచి ఆన్‌లైన్ గేమ్స్‌పై 28% జీఎస్టీ విధించారు. గెలిచిన డబ్బు మీద 30% పన్ను కూడా విధిస్తున్నారు. మొత్తం మీద వినియోగదారుల వ్యసనాన్ని తగ్గించడం, అక్రమ ఆన్‌లైన్ డబ్బు ప్రవాహాన్ని నియంత్రించడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగానే మారింది.