కూకట్‌పల్లిలో బాలిక హత్య.. మిస్టరీలో ఎన్నో అనుమానాలు

హైదరాబాద్ నగరాన్ని వణికించిన ఘటన కూకట్‌పల్లిలో చోటుచేసుకుంది. పదేళ్ల బాలిక సహస్రను దారుణంగా హత్య చేసిన సంఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సంఘటన స్థలంలో లభించిన ఆధారాల ప్రకారం, ఈ ఘాతుకం బయటివారు కాకుండా అదే భవనంలో నివసిస్తున్న వారిలో ఎవరో చేయి ఉండవచ్చని అనుమానాలు బలపడ్డాయి.

సంగీత్‌నగర్‌లోని G+2 భవనంలో నివసించే సహస్ర కుటుంబానికి తెలిసిన వారే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసుల అంచనా. భవనం ప్రధాన ద్వారం గుండా ఇతరులు ప్రవేశించిన రికార్డు లేకపోవడం దీనికి బలమైన ఆధారం. దీంతో ఆ భవనంలో నివసిస్తున్న నలుగురిని పోలీసులు విచారణకు తీసుకెళ్లారు. అయితే ఇప్పటివరకు స్పష్టమైన సమాచారం బయటపడలేదు.

ఈ హత్య వెనుక ఆర్థిక లావాదేవీలు లేదా వ్యక్తిగత కక్షలు ఉన్నాయా అన్న దానిపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు. అనారోగ్య కారణంగా తాయెత్తులు కట్టుకున్న మరో రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తిపై చేతబడి నెపం ఉన్నట్లు ప్రచారం జరిగినా, దానికి సరైన ఆధారాలు దొరకలేదు. ప్రస్తుతం సెల్‌ఫోన్ డేటా, వేలిముద్రలు, సాంకేతిక ఆధారాల సాయంతో పోలీసులు మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు.

సహస్రపై దాదాపు 20 కత్తి గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదిక తెలిపింది. అందులో మెడపైనే 10 గాయాలు ఉండటం దారుణాన్ని చూపిస్తుంది. సోమవారం ఉదయం 9.30 నుంచి 10.30 గంటల మధ్య ఈ ఘటన జరిగిందని వైద్యులు నిర్ధారించారు. అదే సమయంలో బాలిక కేకలు వినిపించాయని పక్కింటివారు చెప్పడంతో, హత్య పథకం ప్రకారమే జరిగిందని అధికారులు భావిస్తున్నారు.

ఈ దారుణం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. సహస్ర అంత్యక్రియలు సంగారెడ్డి జిల్లా మక్తాక్యాసారంలో జరిపారు. అతి దారుణంగా ఆ చిన్నారి ప్రాణం కోల్పోవడంతో, నిందితులను త్వరగా పట్టుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు అన్ని ఆధారాలను సేకరిస్తూ, త్వరలోనే నిజాన్ని బయటపెడతామని హామీ ఇస్తున్నారు.