ట్రాఫిక్ జామ్లో గంటల తరబడి ఇరుక్కుని ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న సందర్భంలోనూ టోల్ ఫీజు ఎందుకు వసూలు చేస్తున్నారని సుప్రీంకోర్టు ఎన్హెచ్ఏఐని ప్రశ్నించింది. 65 కి.మీ దూరం ప్రయాణానికి 12 గంటలు పట్టినా రూ.150 టోల్ వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని జస్టిస్ బి.ఆర్. గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ప్రయాణికుల మనసులో ఉన్న సందేహాలకు ప్రతిధ్వనిలా మారాయి.
ఇటీవల కేరళ హైకోర్టు కూడా ఇదే తరహాలో ఒక తీర్పు ఇచ్చింది. త్రిస్సూర్ జిల్లాలోని పలియెక్కర టోల్ ప్లాజా వద్ద రోడ్డు పనుల కారణంగా పరిస్థితి దారుణంగా ఉండడంతో నెల రోజుల పాటు టోల్ వసూలు చేయకూడదని ఆదేశించింది. రోడ్డు పనులు సక్రమంగా జరగకపోవడం, లారీ ప్రమాదం వంటి అంశాలు టోల్ వసూళ్లపై ప్రశ్నలు లేవనెత్తాయి. సుప్రీంకోర్టు కూడా ఇలాంటి ఉదాహరణలను పరిగణనలోకి తీసుకుంది.
ఎన్హెచ్ఏఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ లారీ ప్రమాదం కారణంగా ట్రాఫిక్ ఏర్పడిందని, అది దైవఘటనగా పరిగణించాలన్నాడు. అయితే జస్టిస్ వినోద్ చంద్రన్ దీనిని తిరస్కరించారు. రోడ్డుపై గుంతల వల్లే లారీ దిగబడిందని, ఆ సమస్యలే ట్రాఫిక్కు మూలమని స్పష్టంగా తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో టోల్ వసూలు చేయడం ప్రజలకు అన్యాయం అవుతుందని వ్యాఖ్యానించారు.
ప్రయాణికులు రోడ్డు నాణ్యత కోసం, వేగవంతమైన ప్రయాణం కోసం టోల్ చెల్లిస్తున్నారు. కానీ అదే టోల్ రోడ్లపై గుంతలు, పనులు, ట్రాఫిక్ జామ్లు ఉంటే ఆ రుసుము వసూలు చేయడం సరికాదు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఈ అంశంపై మరింత చర్చకు దారితీస్తున్నాయి. ఈ కేసులో తుది తీర్పు ఇంకా రాలేదు. కానీ కోర్టు చేసిన వ్యాఖ్యలు భవిష్యత్తులో టోల్ విధానాలను మార్చేలా ప్రభావం చూపే అవకాశం ఉంది. ట్రాఫిక్లో చిక్కుకున్నప్పుడు ప్రజలు చెల్లించే టోల్కు సరైన విలువ దక్కాలన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates