రొనాల్డో ఇండియాకు వస్తాడా?

ఫుట్‌బాల్‌ అభిమానులకు ఊహించని సర్ప్రైజ్‌ దక్కే అవకాశం ఉంది. పోర్చుగీస్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో భారత్‌లో ఆడే అవకాశం వచ్చేసింది. AFC చాంపియన్స్ లీగ్ టూ 2025 -26 డ్రాలో సౌదీ అరేబియా క్లబ్‌ అల్ నస్ర్, భారత సూపర్ లీగ్ జట్టు FC గోవా ఒకే గ్రూప్‌లోకి వచ్చాయి. ఈ గ్రూప్ Dలో ఇరాక్‌కి చెందిన అల్ జావ్రా FC, తజికిస్తాన్‌ క్లబ్ FC ఇస్తిక్లోల్ కూడా ఉన్నాయి.

FC గోవా ఈ టోర్నీకి సూపర్ కప్ 2025 గెలిచి ప్లేఆఫ్‌కి చేరింది. తర్వాత ఒమాన్‌కి చెందిన అల్ సీబ్‌పై విజయం సాధించి గ్రూప్‌ స్టేజీకి అర్హత సాధించింది. రొనాల్డో కెప్టెన్సీలో ఉన్న అల్ నస్ర్‌ సౌదీ ప్రో లీగ్‌లో మూడో స్థానంతో ముగించి, AFC చాంపియన్స్ లీగ్ ఎలైట్‌లోకి చేరలేకపోయింది. ఇప్పుడు ఈ ACL 2 టోర్నీలో FC గోవాతో తలపడనుంది.

ఈ పోటీ హోమ్‌ అవే ఫార్మాట్‌లో జరగనుంది. అంటే FC గోవా హోమ్ మ్యాచ్‌లో రొనాల్డో భారత్‌కు రావచ్చు. కానీ ఖచ్చితంగా ఆయన ఆడతారో లేదో ఇప్పుడు చెప్పడం కష్టం. మ్యాచ్‌లు సెప్టెంబర్ 16 నుంచి డిసెంబర్ 24 వరకు జరుగుతాయి. తర్వాత ఫిబ్రవరిలో రౌండ్ ఆఫ్ 16, మార్చిలో క్వార్టర్‌ ఫైనల్స్, ఏప్రిల్‌లో సెమీస్, మే 16, 2026న ఫైనల్ జరగనుంది.

గ్రూప్ స్టేజీలో మొత్తం 32 జట్లు  పశ్చిమ, తూర్పు జోన్లలో 16 చొప్పున – ఎనిమిది గ్రూపులుగా విభజించబడ్డాయి. ప్రతి గ్రూప్‌లో టాప్ 2 జట్లు రౌండ్ ఆఫ్ 16కి అర్హత పొందుతాయి. FC గోవాకి ఇది చారిత్రక అవకాశం, ఎందుకంటే రొనాల్డో లాంటి గ్లోబల్ ఐకాన్‌తో ఒకే మైదానంలో ఆడే అవకాశం వస్తుంది.

రొనాల్డో భారత్ మైదానంలో అడుగు పెడితే, అది ISL, భారత ఫుట్‌బాల్‌కు ఒక పెద్ద ప్రమోషన్ అవుతుంది. అభిమానులు, మీడియా, స్పాన్సర్లు, అందరి దృష్టి ఈ మ్యాచ్‌పైనే ఉంటుంది. సెప్టెంబర్ 16న మొదలయ్యే ఈ ప్రయాణంలో FC గోవా ఎలా రాణిస్తుందో, రొనాల్డో భారత్ లో అడుగుపెడతాడో లేదో చూడాలి.