2027 వరల్డ్‌కప్: విరాట్ – రోహిత్ ఉండాలంటే..

Kohli and Rohit Sharma
Kohli and Rohit Sharma

టీ20, టెస్టు ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పుడు కేవలం వన్డే క్రికెట్‌లోనే ఉన్నారు. కానీ 2027 వన్డే ప్రపంచకప్‌లో వీరి ప్రస్థానం కొనసాగాలంటే బీసీసీఐ ఒక కీలక షరతు పెట్టినట్లు క్రికెట్ వర్గాల సమాచారం. ఈ కండీషన్ కు ఒప్పుకోకపోతే, వన్డే ఫార్మాట్‌లో కూడా వీరి ప్రయాణం త్వరగా ముగిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

లేటెస్ట్ టాక్ ప్రకారం, ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రారంభమయ్యే దేశవాళీ విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్, కోహ్లీ తప్పనిసరిగా ఆడాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఫిట్‌నెస్, ఫామ్‌ను నిరూపించుకునే వేదికగా ఈ టోర్నీని ఉపయోగించుకోవాల్సిందేనని సూచన వచ్చింది. ఇందులో ఆడకపోతే, 2027 వరల్డ్‌కప్ జట్టులో వీరికి స్థానం కల్పించడం కష్టమని స్పష్టమైన సంకేతాలు ఉన్నాయట. 

రోహిత్, కోహ్లీ భవిష్యత్తు గురించి వచ్చే రెండు నెలల్లోనే స్పష్టత రానుంది. త్వరలో టీమ్‌ఇండియా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో వీరిని ఎంపిక చేస్తారా లేదా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. రోహిత్ పరిస్థితిపై స్పష్టత లేకపోయినా, కోహ్లీ మాత్రం లండన్‌లో ప్రాక్టీస్ ప్రారంభించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ప్రస్తుతం వన్డే జట్టుకు రోహిత్ శర్మే కెప్టెన్. ఇటీవలే ఆయన సారథ్యంలో టీమ్‌ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. అయితే బీసీసీఐ భవిష్యత్ దృష్ట్యా యువ జట్టును సిద్ధం చేయాలనుకుంటే, శుభ్‌మన్ గిల్‌కు వన్డే కెప్టెన్సీ అప్పగించే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేము. ఇది జరిగితే, రోహిత్ కోహ్లీ త్వరలోనే గుడ్ బై చెప్పే అవకాశం ఉంది. ఏదేమైనా రాబోయే వరల్డ్ కప్ వరకు ఈ ఇద్దరు దిగ్గజాల క్రికెట్ ప్రయాణం కొనసాగాలంటే బీసీసీఐ షరతు తీరడం తప్పనిసరి. ఫిట్‌నెస్, ఫామ్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌లో పాల్గొని తమ అంకితభావాన్ని చూపించాల్సిన సమయం ఇది. మరి ఈ ఇద్దరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.