ఇంగ్లాండ్తో జరిగిన తాజా టెస్టు సిరీస్ క్రికెట్ అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా చరిత్రలోకి ఎక్కింది. ఈ సిరీస్లో రెండు జట్లూ కలిపి 7,187 పరుగులు చేయడం, 19 సెంచరీలు నమోదు కావడం, 470 బౌండరీలు పడటం వంటి అరుదైన రికార్డులు నమోదయ్యాయి. ఇది 1993 యాషెస్ సిరీస్ తర్వాత 7,000కి పైగా పరుగులు నమోదు చేసిన రెండో ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్గా నిలిచింది. ఐదు టెస్టుల్లో ఇంత పరుగుల హంగామా క్రికెట్ చరిత్రలోనే అరుదు.
భారత్ తరపున కెప్టెన్ శుభ్మన్ గిల్ 754 పరుగులు చేసి, ఒక టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్గా నిలిచాడు. అలాగే నాలుగు సెంచరీలు కొట్టి బ్రాడ్మన్, కోహ్లీ, గవాస్కర్ సరసన చేరాడు. యశస్వి జైస్వాల్ కూడా నాలుగు సెంచరీలు బాదుతూ, సిరీస్లో 1,000 పరుగులు పూర్తి చేశారు. జడేజా ఈ సిరీస్లో ఆరు హాఫ్ సెంచరీలు చేయడం ద్వారా ప్రత్యేకంగా గుర్తింపు పొందాడు. వాషింగ్టన్ సుందర్ తన తొలి టెస్ట్ సెంచరీ నమోదు చేయగా, రిషబ్ పంత్ రెండు ఇన్నింగ్స్లలో సెంచరీలు చేసి వికెట్ కీపర్గా రికార్డు సాధించాడు.
ఇంగ్లాండ్ తరపున జో రూట్ భారత్పై తన 13వ టెస్ట్ సెంచరీతో, ఒకే జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన ఇంగ్లండ్ బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. అలాగే భారత్పై 3,000 పరుగులు పూర్తి చేశాడు. బెన్ స్టోక్స్ కెప్టెన్గా సెంచరీ కొట్టి ఐదు వికెట్లు తీసిన తొలి ఇంగ్లండ్ కెప్టెన్గా నిలిచాడు. జేమీ స్మిత్ వికెట్ కీపర్గా 184 నాటౌట్ స్కోర్ చేసి ప్రత్యేకంగా నిలిచాడు.
సిరీస్లో భారత్ సాధించిన 6 పరుగుల తేడా విజయం కూడా చరిత్రలో నిలిచిపోయేలా ఉంది. చివరి రోజు, చివరి సెషన్ వరకు ఉత్కంఠ కొనసాగిన మ్యాచ్లో సిరాజ్ ఐదు వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇదే మ్యాచ్లో భారత్ తక్కువ మార్జిన్తో టెస్ట్ విజయం సాధించడం ఇదే మొదటిసారి. ముగ్గురు భారత ఆటగాళ్లు సిరీస్లో 500కి పైగా పరుగులు చేయడం కూడా ఇదే తొలిసారి.
Gulte Telugu Telugu Political and Movie News Updates