కిక్కిచ్చిన టెస్ట్ మ్యాచ్.. ఇంగ్లాండ్‌కు టీమిండియా పవర్ఫుల్ స్ట్రోక్

చేతిదాకా వచ్చిన సీరిస్ ను కేవలం 6 పరుగుల తేడాతో చేజార్చుకుంది ఇంగ్లాండ్‌. ఒక విధంగా టీమిండియా దక్కనివ్వలేదనే చెప్పాలి. 2-1 తో లీడ్ లో ఉన్న సీరిస్ ను కనీసం డ్రా చేసినా లాభమే కానీ భారత బౌలర్లు చివరి క్షణం వరకు పోరాడి ఏకంగా సీరీస్ ను డ్రాగా మార్చేశారు.

ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్ట్‌లో భారత్ ఉత్కంఠభరితమైన విజయం సాధించింది. చివరి రోజు ఆటలో అద్భుతంగా పోరాడిన టీమిండియా కేవలం ఆరు పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. నాలుగో రోజు చివరికి 339/6తో నిలిచిన ఇంగ్లాండ్, చివరి రోజు కేవలం 28 పరుగుల వ్యవధిలో చివరి నాలుగు వికెట్లను కోల్పోయింది. మహ్మద్ సిరాజ్ ఐదు వికెట్లతో భారత విజయాన్ని ఖాయం చేశాడు.

374 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్ జట్టు చివరి రోజు జేమీ ఓవర్టన్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే సిరాజ్ తన మొదటి ఓవర్‌లోనే జేమీ స్మిత్ (2)ను అవుట్ చేసి భారత్‌కు శుభారంభం అందించాడు. ఆ వెంటనే మరో వికెట్ తీసి జట్టు విజయానికి కీలకంగా నిలిచాడు. ప్రసిద్ధ్ కృష్ణ కూడా తన వేగంతో జోష్ టంగ్‌ను (0) క్లీన్ బౌల్డ్ చేసి భారత్‌ను విజయానికి చేరువ చేశాడు.

మ్యాచ్ చివర్లో తీవ్రంగా గాయపడిన క్రిస్ వోక్స్ ఒంటి చేత్తోనే బ్యాటింగ్‌కు వచ్చి తీవ్రంగా పోరాడాడు. అతనికి అట్కిన్సన్ కూడా తోడుగా నిలిచి భారత్‌కు కాస్త ఒత్తిడి కలిగించారు. ఈ జోడీ భారీ షాట్లతో విజయానికి ప్రయత్నించింది. సిరాజ్ బౌలింగ్‌లో బౌండరీ వద్ద ఆకాశ్ దీప్ క్యాచ్‌ను జారవిడవడంతో మ్యాచ్ మరింత ఉత్కంఠకు గురైంది.

చివరికి విజయానికి ఏడే పరుగులు అవసరమైన సమయంలో మహ్మద్ సిరాజ్ అద్భుతమైన బంతితో అట్కిన్సన్‌ను క్లీన్ బౌల్డ్ చేసి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. మొత్తం మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన సిరాజ్‌ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. సెంచరీలు సాధించిన జో రూట్, హ్యారీ బ్రూక్‌ల వికెట్లు తీసి భారత్‌కు తిరుగులేని విజయాన్ని అందించడంలో సిరాజ్‌ కీలక పాత్ర పోషించాడు.

ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్ 2-2తో సమమైంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 224 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ 247 పరుగులు సాధించింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులతో పుంజుకున్న భారత్ చివరకు అద్భుతమైన విజయం సాధించి, తమ పోరాట పటిమను చాటింది.