పాకిస్థాన్‌తో క్రికెట్.. అశ్విన్ కౌంటర్

గత కొన్ని నెలల్లో భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు ఎంతగా దెబ్బ తిన్నాయో తెలిసిందే. కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి వెనుక ఉన్నది పాకిస్థానే అని స్పష్టమైన సమాచారం ఉండడంతో ఆ దేశంతో అన్ని రకాల సంబంధాలను తెంచుకుంటూ పోతోంది భారత్. ఈ క్రమంలోనే భారత్‌ నుంచి పాకిస్థాన్‌కు వెళ్లే సింధు జలాల విషయంలోనూ ఆంక్షలు విధించింది.

క్రీడల పరంగా కూడా పాకిస్థాన్‌తో ఏ రకమైన సంబంధమూ పెట్టుకోకూడదన్న డిమాండ్లు వినిపిస్తున్న తరుణంలో.. ఇటీవల లెజెండ్స్ క్రికెట్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేశారు భారత క్రికెటర్లు. ఈ విషయంలో మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ చొరవ తీసుకోగా.. మిగతా భారత ఆటగాళ్లు కూడా అతడికి మద్దతుగా నిలిచారు. దీంతో టోర్నీలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ ఆరంభానికి కొన్ని గంటల ముందు ఆ పోరును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి.

ఐతే లెజెండ్స్ క్రికెట్లో భారత క్రికెటర్లు ఇలా వెనక్కి తగ్గడం బాగానే ఉంది కానీ.. ఇప్పుడు బీసీసీఐ మాత్రం పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడేందుకు పచ్చజెండా ఊపడమే విమర్శలకు దారి తీస్తోంది. సెప్టెంబరులో జరిగే ఆసియా కప్ టీ20 టోర్నీ షెడ్యూల్ తాజాగా ఖరారైంది. అందులో లీగ్ దశలోనే భారత్, పాకిస్థాన్ రెండుసార్లు తలపడబోతున్నాయి. రెండు జట్లనూ ఒకే గ్రూప్‌లో పెట్టారు. ఇది ఎప్పుడూ జరిగేదే కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్‌ ఉన్న గ్రూప్‌లోనే భారత్‌నూ పెట్టడం, లీగ్ దశలో ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌లకు అంగీకరించడమే విమర్శలకు తావిస్తోంది.

కొన్ని నెలల కిందటే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రవిచంద్రన్ అశ్విన్.. ఈ విషయమై బీసీసీఐకి గట్టి కౌంటర్ ఇచ్చాడు. లెజెండ్స్ క్రికెట్లో వచ్చే ఆదాయం తక్కువ కాబట్టి.. అక్కడ పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేశారని.. కానీ ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లతో ముడిపడ్డ డబ్బు చాలా ఎక్కువ కాబట్టి దీనికి ఓకే చెప్పారని.. డబ్బులను బట్టే దేశభక్తి ఉంటుందని అతను ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అతడి కామెంట్లకు సోషల్ మీడియాలో పూర్తి మద్దతు లభిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడాల్సిన అవసరమేంటని.. బీసీసీఐకి డబ్బులు మాత్రమే ముఖ్యమని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.