దిగ్గజాల కంటే మెండుగా గిల్ ఘనత

ఇంగ్లండ్‌తో మొదటి టెస్టులో తడబడినా రెండో టెస్టులో టీమిండియా పవర్ఫుల్ విజయాన్ని నమోదు చేసింది. 336 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఘనంగా విజయం సాధించి ఐదు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ముఖ్యంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా టెస్టు గెలిచిన తొలి ఆసియా కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకుముందు ఈ మైదానంలో ఆడిన విరాట్ కోహ్లీ, కపిల్ దేవ్, ఇమ్రాన్ ఖాన్ లాంటి దిగ్గజులు గెలుపు నమోదు చేయలేకపోయిన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్‌ పూర్తిగా గిల్ ఆధిపత్యంతో సాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు 587 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇందులో గిల్ 278 బంతుల్లో 269 పరుగులతో డబుల్ సెంచరీ నమోదు చేసి మ్యాచ్‌ను తన నియంత్రణలో ఉంచాడు. అతనికి తోడుగా రిషభ్ పంత్ 91, కేఎల్ రాహుల్ 72 పరుగులు చేసి భారత్‌ను ముందుకు నడిపించారు.

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సిరాజ్ 6/92తో చెలరేగగా, ఆకాశ్ దీప్ 4/69తో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 427/5 వద్ద డిక్లేర్ చేసింది. ఇందులో గిల్ మరోసారి అలరించాడు. 161 పరుగులు చేసి మ్యాచ్‌ను భారత్ చేతుల్లోకి తీసుకెళ్లాడు. పంత్ 64, జడేజా 51 పరుగులతో సహకరించారు.

ఇంగ్లండ్ ముందు 608 పరుగుల భారీ లక్ష్యం నిలవగా, ఆతిథ్య జట్టు కేవలం 271 పరుగులకే కుప్పకూలింది. ఆకాశ్ దీప్ మరోసారి ఆకాశాన్నంటాడు. 6/66తో ఇంగ్లండ్ బ్యాటింగ్‌ను కుప్పకూలేలా చేశాడు. దీంతో అతడు మ్యాచ్‌లో మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు. ఇది అతడి టెస్టు కెరీర్‌లోనే తొలిసారి. ఈ విజయంతో అతను ఆటగాడిగా మాత్రమే కాకుండా భారత్‌కు నూతన బౌలింగ్ నాయ‌కుడిగా నిలిచాడు.

గిల్ సారథ్యంలో భారత జట్టు పూర్తి సమన్వయంతో విజయాన్ని అందుకుంది. కెప్టెన్‌గా అతడు చేసిన స్ట్రాటజీలు, సమయస్పూర్తితో తీసుకున్న నిర్ణయాలు మ్యాచ్‌పై ప్రభావం చూపించాయి. సీనియర్ కెప్టెన్లు సాధించలేని రికార్డును కేవలం రెండో టెస్టుతోనే గిల్ సాధించటం అతడి భవిష్యత్ కెప్టెన్సీకి మైలురాయిగా నిలవనుంది. టీమిండియా మిగతా మూడు టెస్టులను కూడా గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.