-->

పదేళ్లు నో ప్లేఆఫ్స్.. ఇప్పుడు నంబర్‌వన్

ప్రతి సంవత్సరం ఐపీఎల్ మొద‌ల‌వుతుంటే.. కప్పు ఎవరు గెలుస్తారు.. ఏ జట్లు ప్లేఆఫ్స్ చేరతాయి, ఏ జట్లు ముందే నిష్క్రమిస్తాయి అని అంచనాలు కడుతుంటారు అభిమానులు. ఈసారి సీజన్ ఆరంభమవుతుండగా.. పంజాబ్ కింగ్స్ అనే జట్టు లీగ్ దశలో అగ్రస్థానంలో నిలుస్తుందని ఎవ్వరైనా ఊహించి ఉంటారా? అసలు ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరుతుందని నమ్మిన వాళ్లు చాలా తక్కువమందే అయ్యుంటారు. ఎందుకంటే లీగ్‌ చరిత్రలో ఆ జట్టు ప్రదర్శన అలాంటిది. గత పదేళ్లలో ఒక్కసారి కూడా పంజాబ్ ప్లేఆఫ్స్ ఆడింది లేదు.

కప్పు గెలవడం సంగతి అటుంచితే.. గత 17 సీజన్లలో పంజాబ్ ఫైనల్ ఆడిందే ఒక్కసారి. ఇలాంటి జట్టు ఈ సీజన్లో మహా మహా జట్లను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలవడం అంటే సామాన్యమైన విషయం కాదు. వరుస విజయాలతో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్న ముంబయిని సోమవారం అలవోకగా ఓడించిన పంజాబ్.. అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మంగళవారం బెంగళూరు కొంచెం ఘనంగా గెలిస్తే పంజాబ్ రెండో స్థానానికి పడిపోవచ్చు. లేదంటే అగ్రస్థానంతోనే లీగ్ దశను ముగించవచ్చు.

మొత్తానికి ఆ జట్టు టాప్-2లోనే ఉండబోతోంది. కాబట్టి నేరుగా తొలి క్వాలిఫయర్ ఆడే అవకాశం దక్కించుకుంది. అందులో గెలిస్తే ఫైనల్‌కు వెళ్తుంది, ఓడినా రెండో క్వాలిఫయర్ ఆడే అవకాశముంటుంది. పంజాబ్ రాత ఇలా మారిపోవడంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పాత్ర అత్యంత కీలకం అనడంలో సందేహం లేదు. ఢిల్లీ జట్టు ఇన్నేళ్లలో ఒకే ఒక్క ఫైనల్ ఆడింది. అప్పుడు కెప్టెన్ శ్రేయసే. కోల్‌కతా గత ఏడాది పదేళ్ల గ్యాప్ తర్వాత కప్పు గెలిచిందన్నా అది అతడి క్రెడిట్టే. ఈసారి పంజాబ్ జట్టు పగ్గాలు చేపట్టి దాని రాత మార్చేశాడు శ్రేయస్. మరి ఇదే ఊపులో ఆ జట్టుకు తొలి కప్పు కూడా అందిస్తాడేమో చూడాలి.